2024 బిగ్ ఎలక్షన్స్: ఆంధ్రాలో “వన్ మ్యాన్ షో” రిపీట్..?
ఆంధ్రప్రదేశ్లో పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే వైసీపీ పార్టీ అధికారాన్ని చేపట్టింది. 2014లో 67 సీట్లు సాధించి, అందరి దృష్టి ఆకర్షించిన వైసీపీ, 2019లో హిస్టరీ క్రియేట్ చేస్తూ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆ ఎన్నికల్లో జగన్ చరిష్మా ఏం రేంజ్లో పని చేసిందో, ఫలితాలే తేల్చేశాయి. అనేక అసెంబ్లీ సెగ్మెంట్లలో అభ్యర్ధులతో పని లేకుండా, జగన్ను చూసి మాత్రమే ఓటు వేశారు అనడంలో అతిశయోక్తి లేదు.
అయితే ఇప్పుడు ఏపీలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగబోతుంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిశారు. బీజేపీ కూడా తమ కూటమితో కలుస్తుందని, అలాగే వామ పక్షాలను కూడా కలుపుకుని పోతామని, జనసేనాని వెల్లడించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపు అంత ఈజీ కాదని, కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దీంతో 2019 ఎన్నికల్లో జగన్ వన్ మ్యాన్ షోతో ప్రభంజనం సృష్టించిన వైసీపీ, 2024లో అదే మ్యాజిక్ రిపీట్ చేస్తుందా అనేది ఆశక్తికరమైన అంశం. ఇక జగన్ను గద్దె దించేందుకు టీడీపీతో కలుస్తున్నాని, వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడిస్తామని పవన్ కళ్యాణ్ శపథాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై, వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.
మరోవైపు జగన్ మాత్రం సింగిల్గానే వస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చూసి మాత్రమే, వైసీపీకి ఓటు వేయాలని, ప్రజలలోకి వెళుతున్నారు జగన్. ఈ క్రమంలో తోడేళ్ల గుంపు ఎన్ని వచ్చినా సింహం ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుందని, రాష్ట్రంలో అన్నిపార్టీలు కలిసి పోటీ చేసినా, వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తుందని, మరోసారి అధికారాన్ని చేపడుతుందని, ఆ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు.
ఇక ఇటీవల పలు సర్వే సంస్థలు, రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు నిర్వహించగా, మరోసారి వైసీపీ విజయభేరి మోగించడం ఖాయమని ఆ సర్వే ఫలితాలు అంచాన వేశాయి. రాష్ట్రంలో ప్రజా నాడి బట్టి చూస్తే, గతంలో కంటే జగన్ మోహన్ రెడ్డి ఇమేజ్ మరింత పెరిగిందని, ప్రీపోల్ సర్వేలు తేల్చేశాయి. దీంతో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్ బొమ్మ సరిపోతుందని, సర్వే రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీంతో వై నాట్ 175 కష్టమే అయినా, 2024లో మరోసారి జగన్ వన్ మ్యాన్ షో ఖాయమని, రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.