
Bollywood: బాలీవుడ్లో కలకలం.. సెలబ్రిటీలకు బెదిరింపులు!
బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు వరుస బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. మొన్న ఓ దుండగుడి చేతిలో సైఫ్ అలీ ఖాన్ కత్తిపోట్లకు గురై కోలుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్కు చెందిన కమెడియన్, యాక్టర్ కపిల్ శర్మ, నటుడు రాజ్పాల్ యాదవ్, కొరియోగ్రాఫర్, దర్శకుడు రెమో డిసౌజా, సింగర్ సుగంధ మిశ్రాలకు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
పబ్లిక్ స్టంట్ కాదు..!
బిష్ణు అనే పేరుతో వీరికి బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చినట్లు పేర్కొన్నారు. కాగా, బెదిరింపు మెయిల్లో ‘మేము మీ ప్రతి కదలికను ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తున్నాం. ఇది పబ్లిక్ స్టంట్ లేదా మిమ్మల్ని వేధించే ప్రయత్నం అయితే కానే కాదు. మీరు ఈ సందేశాన్ని సీరియస్గా తీసుకోండి’ అంటూ ఈ-మెయిల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అయితే ఆ వ్యక్తి డిమాండ్లు ఏంటన్నవి మాత్రం ఇంకా బయటకు రాలేదు. బిష్ణు అనే పేరుతో బెదిరింపులు రావడంతో ఇవి గ్యాంగ్స్టర్ బిష్ణోయ్ నుంచి వచ్చి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.