
సూపర్ స్టార్ మహేశ్ బాబు – పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న SSMB29 మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ ఈవెంట్ కోసం ప్రియాంక చోప్రా హైదరాబాద్ వచ్చారు. ఆమె మూడు రోజులుగా హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు ప్రసిద్ధ ఆలయాలను ప్రియాంక సందర్శిస్తున్నారు. మొన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన ఆమె.. తాజాగా కామారెడ్డి జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాన్ని దర్శించుకున్నారు.
కామారెడ్డి గడికోట ఆలయంలో పూజలు..
కామారెడ్డి జిల్లాలోని దోమకొండ గడికోట మహాదేవుడి ఆలయాన్ని ప్రియాంక చోప్రా శుక్రవారం సందర్శించారు. దట్టమైన పొగమంచులో హైదరాబాద్ నుంచి ఉదయం కారులో బయల్దేరి దోమకొండ చేరుకున్నారు. అక్కడ గడికోటలో కొలువుదీరిన ప్రసిద్ధ మహాదేవుని ఆలయానికి వెళ్లారు. ఆలయంలోని సోమసూత్ర శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె తన ఇన్స్టా స్టోరీస్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.