Allu Arjun: శ్రీతేజ్ను పరామర్శించిన అల్లు అర్జున్
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను అల్లు అర్జున్ పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాలుడి తండ్రి భాస్కర్తోనూ మాట్లాడారు. అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అల్లు అర్జున్ రాకతో పోలీసులు ఆసుపత్రి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
శ్రీతేజ్ కుటుంబానికి అండగా నిలిచిన పుష్ప-2 టీం!
కాగా.. డిసెంబర్ 4 ‘పుష్ప-2’ ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో శ్రీతేజ్ తల్లి రేవతి మృతి చెందగా, శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, ఇప్పటికే రేవతి కుటుంబానికి అల్లు అర్జున్తో పాటు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ ఆర్థికసాయం ప్రకటించారు. అల్లు అర్జున్ రూ.కోటి, పుష్ప-2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50 లక్షల చెక్కులను ఇటీవల దిల్ రాజు ద్వారా ఆ కుటుంబానికి అందజేశారు.