
Duggubati Family: హీరో వెంకటేశ్, రానాలపై కేసు నమోదు.. అసలేమైంది..?
ఫిల్మ్నగర్లోని డెక్కన్ కిచెన్ హోటల్ వివాదంలో హీరో వెంకటేశ్ కుటుంబంపై కేసు నమోదైంది. నందకుమార్ అనే వ్యక్తికి, దగ్గుబాటి కుటుంబానికి డెక్కన్ కిచెన్ హోటల్ స్థలం విషయంలో వివాదం నడుస్తోంది. 2022లో జీహెచ్ఎంసీ సిబ్బంది, బౌన్సర్లతో కలిసి దగ్గుబాటి కుటుంబం ఈ హోటల్ ను కొంతమేర ధ్వంసం చేసింది. నందకుమార్ దీనిపై హైకోర్టును ఆశ్రయించడంతో.. ఆ స్థలంలో ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని, యథాతథ స్థితిని కొనసాగించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. గతేడాది జనవరిలో దగ్గుబాటి ఫ్యామిలీ ఆ హోటల్ను పూర్తిగా నేలమట్టం చేసింది. దాంతో నందకుమార్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. నిన్న నందకుమార్ పిటిషన్ను విచారించిన కోర్టు.. దగ్గుబాటి కుటుంబంపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో విచారణ జరపాలని ఫిలింనగర్ పోలీసులను ఆదేశించింది.
ఏ2గా వెంకటేశ్, ఏ3గా రానా!
కోర్టు ఆదేశాల నేపథ్యంలో దగ్గుబాటి ఫ్యామిలీపై ఫిలింనగర్ పోలీసులు 448, 452, 458, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు, ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని ఫిల్మ్నగర్ పోలీసులకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఎఫ్ఐఆర్లో ఏ1గా దగ్గుబాటి సురేశ్, ఏ2గా వెంకటేశ్, ఏ3గా దగ్గుబాటి రానా, ఏ4గా దగ్గుబాటి అభిరామ్లను పేర్కొన్నారు.