Jaanvi: ‘పుష్ప-2’పై విమర్శలు.. స్ట్రాంగ్ కౌంటరిచ్చిన హీరోయిన్ జాన్వీ కపూర్!
నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్.. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ‘పుష్ప-2’ హవానే కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమాకు ప్రాంతాలతో సంబంధం లేకుండా సినిమా అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే ఈ చిత్రానికి ఎక్కువ థియేటర్లు కేటాయించడంపై ఉత్తరాదిన కొందరు అసహనం వ్యక్తంచేస్తున్నారు. సినీప్రియులకు ఎంతో ఇష్టమైన సినిమాల్లో హాలీవుడ్ మూవీ ‘ఇంటర్ స్టెల్లార్’ ఒకటి. క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వంలో ఈ చిత్రం 2014లో విడుదలైంది. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేయాలని భావించారు. అయితే ఎక్కువ శాతం ఐమాక్స్ల్లో ‘పుష్ప2’ ఉండడంతో దీని రీరిలీజ్ను ఇండియాలో వాయిదా వేశారు. దీంతో కొందరు ‘పుష్ప2’కు ఎక్కువ థియేటర్లు ఇచ్చారంటూ విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే వారికి హీరోయిన్ జాన్వీ కపూర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
ఎందుకు తక్కువ చేస్తున్నారు?
‘పుష్ప-2’ కూడా సినిమానే కదా.. ఎందుకు మరొకదానితో దీన్ని పోలుస్తూ తక్కువ చేస్తున్నారు. మీరు ఏదైతే హాలీవుడ్ సినిమాను సపోర్ట్ చేస్తున్నారో.. వారే మన సినిమాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ.. మనం మాత్రం మన చిత్రాలను తక్కువ చేసుకుంటూ మనల్ని మనమే అవమానించుకుంటూ ఉండిపోతున్నాం. ఇలాంటివి చూసినప్పుడు బాధగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. మరోవైపు, తెలుగు సినిమాకు జాన్వీ మద్దతివ్వడం చూసి ప్రేక్షకులు ఆమెను ప్రశంసిస్తున్నారు. ధైర్యంగా సమాధానం చెప్పారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.