Keerthi Suresh: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ‘మహానటి’!
మహానటి కీర్తి సురేశ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఆమె చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీ ఆమె మెడలో మూడు ముళ్లు వేశారు. గోవాలోని ఓ ప్రముఖ రిసార్ట్లో ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను కీర్తి తన ఇన్స్టాలో షేర్ చేశారు. #fortheloveofnyke అనే హ్యాష్ ట్యాగ్ జత చేశారు. సోషల్ మీడియాలో వైరలవుతున్న వీరి ఫోటోలను చూసి అందరూ విషెస్ చెబుతున్నారు.
ఒక్కటైన పదిహేనేళ్ల బంధం!
కీర్తి సురేశ్ పెళ్లిపై గత ఏడాది కాలంగా రకరకాల వార్తలు వచ్చాయి. చివరకు నెల క్రితం ఆమెనే తన పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తన చిన్ననాటి స్నేహితుడు, ప్రియుడు ఆంటోనీని పెళ్లి చేసుకుంటున్నట్లు స్పష్టంచేశారు. దీపావళి వేడుకల్లో భాగంగా ఆయనతో కలిసి దిగిన ఫొటోని షేర్ చేస్తూ దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని తెలిపారు. మరోవైపు.. ఇటు సినిమాల్లో కీర్తి బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆమె ‘రివాల్వర్ రీటా’, ‘బేబీ జాన్’ సినిమాల్లో నటిస్తున్నారు. అంతేకాదు, ‘బేబీ జాన్’తో ఆమె బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది.