Pushpa-2: ‘పుష్ప-2’ రీలోడెడ్.. మరో 20 నిమిషాలతో రన్ టైంతో కొత్త వెర్షన్!
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ పుష్ప-2. విడుదలై నెల రోజులు దాటినా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ దండయాత్ర ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికే రూ. 1831 కోట్ల వసూళ్లు సాధించి, బాహుబలి రికార్డును అధిగమించిన ఈ సినిమా రూ. 2000 కోట్ల దిశగా దూసుకెళుతోంది. అంతేకాదు, పుష్పరాజ్ దండయాత్ర చూస్తుంటే అమీర్ ఖాన్ నటించిన ‘దంగల్’ సినిమా రికార్డు (రూ. 2,000 కోట్ల ఆల్ టైం వసూళ్లు)ను సైతం అధిగమించే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే గనుక జరిగితే ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఏకైక చిత్రంగా పుష్ప-2 నిలుస్తుంది.
యాడెడ్ ఫుటేజీలో ఏముంటుందంటే..?
అయితే, పుష్ప-2 మరో రూ. 200 కోట్లు కొట్టాలంటే అంత ఈజీ కాదు. పైగా సంక్రాంతి సందర్భంగా పలు బడా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో దంగల్ రికార్డును అధిగమించేందుకు పుష్ప-2 మేకర్స్ మాస్టర్ ప్లాన్ వేశారు. జనవరి 11 నుంచి థియేటర్లలో మరో 20 నిమిషాల ఫుటేజీని యాడ్ చేస్తున్నట్లు పుష్ప-2 టీమ్ ప్రకటించింది. అంటే ఇప్పుడున్న సినిమాకి అదనంగా మరో 20 నిమిషాల జత చేస్తారన్నమాట. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్ చేసింది.దీంతో సినిమా మొత్తం నిడివి 3 గంటల 40 నిమిషాలకు చేరుతుంది.సంక్రాంతి సినిమాల సందడిలో పుష్ప-2 కొట్టుకుపోకుండా మళ్లీ ఆడియన్స్ని థియేటర్లకి రప్పించేందుకు ఈ ప్లాన్ చేశారు. ఈ డిలీటెడ్ సీన్స్లో పుష్ప ఎంట్రీ సీన్లో వచ్చిన ఫైట్లో వాటర్లో పడడంతో కట్ అయిన సీన్ను యాడ్ చేస్తుండగా.. దీనితో పాటు కన్నడ నటుడు తారక్ పొన్నప్పతో వచ్చే యాక్షన్ సీన్ని కూడా జత చేయబోతున్నట్లు తెలుస్తోంది. యాడ్ చేసిన ఫుటేజీతో రిపీట్ ఆడియన్స్ పెరిగి, కలెక్షన్స్ కూడా పెరుగుతాయని మేకర్స్ భావిస్తున్నారు.