Amaravathi: అభివృద్ధి అంటే అమరావతి ఒక్కటేనా.. మరి మిగితా ప్రాంతాల సంగతేంటి?

అధికారంలోకి రాకముందు, వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒకే పాట పాడుతున్నారు. అదే అమరావతి.. అమరావతి.. అమరావతి.. అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధాని అంటూ ఎన్నికలప్పుడే హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడేళ్లు టార్గెట్గా పెట్టుకుని అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని అత్యుత్సాహంతో ముందుకెళ్తున్నారు. ఇందుకోసం వెనకా ముందూ ఆలోచించకుండా ఎన్ని కోట్లు బడితే అన్ని కోట్లు అప్పులు చేసేస్తున్నారు. ఇప్పటికే అమరావతికి రూ.15 వేలు కోట్లు ప్రపంచ బ్యాంక్తో అప్పు ఇప్పించడానికి కేంద్ర ప్రభుత్వం ష్యూరిటీ ఇచ్చింది. ఇది చాలదన్నట్టుగా తాజాగా అమరావతి నిర్మాణం కోసం ఏపీ సీఆర్డీఏకు హడ్కో రూ.11 వేల కోట్ల రుణం ఇవ్వడానికి ముందుకొచ్చినట్టు మంత్రి నారాయణ తెలిపారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలన్నీ అమరావతిలోనే. ఇంకా పరిశ్రమలు, పేరెన్నికగన్న విద్యాసంస్థలు, ఆస్పత్రుల ఏర్పాటు కూడా అమరావతిలోనే. ఇందుకోసం కూటమి సర్కార్ వేగంగా పావులు కదుపుతోంది.
వారికేం సమాధానం చెబుతారు?
అయితే ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది. ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం అమరావతి ఒక్కటేనా? మిగితా ప్రాంతాలకు అభివృద్ధి అవసరం లేదా? ఒక్క అమరావతి ప్రాంత ప్రజలే ప్రజలా.. మిగిలిన ప్రాంతాల్లో ఉన్నవాళ్లు ఈ రాష్ట్ర ప్రజలు కాదా? అంటూ కూటమి ప్రభుత్వంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో అమరావతిని జగన్ సర్కార్ విస్మరించిందని, ఇప్పుడు అభివృద్ధి చేస్తున్నామని కూటమి సర్కార్ చెబుతోంది. మంచిదే. ఇప్పుడు తాను అమరావతిని మాత్రమే అభివృద్ధి చేస్తూ, మిగిలిన ప్రాంతాల్ని విస్మరిస్తున్న సంగతిని ఎందుకు గ్రహించడం లేదో అర్థం కావడం లేదన్న చర్చకు తెరలేచింది. అమరావతి అంటే కేవలం 29 గ్రామాలకు మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదు. రాజధాని అనేది నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. తమ పాలనలోనే రాజధానిలో ఏదో జరిగి పోవాలనే ఆత్రుత ఎందుకో అర్థం కావడం లేదు. ఇలాగైతే మిగిలిన ప్రాంతాలు ఏం కావాలి? అసలే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అన్ని రకాలుగా వెనుకపడ్డాయి. వాటి కోసం ఏదైనా చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఇది ఆ ప్రాంతవాసులను ఆందోళనకు గురి చేస్తోంది.