
AP: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. రేపు వరద బాధితుల ఖాతాల్లో నగదు జమ!
వరద సాయంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వరదల్లో నష్టపోయిన 98 శాతం మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికే వరద సాయం జమ చేసినట్లు పేర్కొన్న ప్రభుత్వం.. సాంకేతిక కారణాలతో పరిహారం అందని బాధితుల ఖాతాల్లో రేపు నగదు జమ అవుతుందని స్పష్టంచేసింది. విజయవాడ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితుల్లో కొంత మంది తమ బ్యాంకు ఖాతాలను తప్పుగా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. వాటిని మళ్లీ క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి సరి చేశారు. వీరి ఖాతాల్లోకి మొత్తం రూ. 18,69,89,000ల సొమ్ము జమ చేయనున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లాలో 15 వేలు, అల్లూరి జిల్లాలో 4,620 కుటుంబాలకు లబ్ధి!
ఇటీవలి వరదలకు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు చాలా ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయాయి. బుడమేరు ఉద్ధృతితో విజయవాడ నగరం ముంపునకు గురైంది. ముంపు బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆధార్ అనుసంధానం సహా పలు కారణాలతో ఇప్పటికీ పరిహారం పొందని ఒక్కో కుటుంబానికి నగదు బదిలీ చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఎన్టీఆర్ జిల్లాలో 15 వేలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 4,620 కుటుంబాలతో సహా ఇతర జిల్లాల్లో బాధిత ప్రజలకు జిల్లా అధికార యంత్రాంగం ద్వారా అకౌంట్లతో డబ్బులు జమ చేయనుంది.