Free Gas: ఉచిత గ్యాస్ పథకం.. ఈ నెల 29 నుంచే బుకింగ్స్ ప్రారంభం!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పంపిణీ పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకానికి సంబంధించి ఎవరెవరు అర్హులు.. ఎలా అప్లై చేసుకోవాలి? తదితర విషయాలను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరించారు. ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్ బుకింగ్స్ ప్రారంభమవుతాయని చెప్పారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చన్నారు.
48 గంటల్లోగా సిలిండర్!
‘సిలిండర్ బుక్ చేసుకోగానే ప్రజలకు ప్రభుత్వం నుంచి సమాచారం వెళ్తుంది. 24 నుంచి 48 గంటల్లో సిలిండర్ను అందిస్తామని ఆయిల్ కంపెనీలు చెప్పాయి. పట్టణాల్లో అయితే 24 గంటల్లోనే సరఫరా చేస్తామని తెలిపాయి. సిలిండర్ అందిన క్షణం నుంచి 48 గంటల్లోపు వారి ఖాతాల్లో నగదు జమ అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయిల్ కంపెనీలకు రూ.894 కోట్లు అందిస్తాం. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ నెల 29న ఆయిల్ కంపెనీలకు చెక్కు అందిస్తున్నాం’ అని తెలిపారు.