Janasena: ఇదేనా సామాజిక న్యాయం..? జనసేనలో కాపులు తప్ప ఎవరూ లేరా?
మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబు త్వరలోనే ఏపీ మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. మొన్నటి దాకా రాజ్యసభ ఎన్నికల బరిలో నిలుస్తారన్న ఆయనకు అనూహ్యంగా మంత్రి పదవి దక్కనుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నాగబాబుకు మంత్రి పదవి దక్కడం పట్ల ‘తెలుగు తమ్ముళ్లు’ కొందరు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబును, బాలకృష్ణను విమర్శిస్తూ ఆయన మాట్లాడిన వీడియోలను కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
కాపుల పార్టీయేనా?
ఇక, నాగబాబుకు మంత్రి పదవిపై పవన్ కళ్యాణ్పైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాగబాబుకు మంత్రి పదవి దక్కితే కూటమి ప్రభుత్వంలో జనసేన బలం నాలుగుకు పెరుగుతుంది. వీళ్లలో నాదెండ్ల మనోహర్ కమ్మ, మిగిలిన ముగ్గురు పవన్, నాగబాబు, కందుల దుర్గేశ్ కాపు సామాజిక వర్గం. జనసేన పార్టీకి కాపుల పార్టీ అని ముందు నుంచీ పేరు ఉండనే ఉంది. బహుశా దాన్నే నిరూపించుకోవాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉత్సాహం చూపుతున్నట్టు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పైకి సామాజిక న్యాయం అంటూ ఊదరగొట్టే పవన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. జనసేన పార్టీలో కాపులు తప్ప ఇంకెవరూ లేరా? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఇటీవల ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ జనసేనపై చేసిన విమర్శలను గుర్తుచేస్తున్నారు. ‘పవన్ సామాజిక న్యాయం గురించి నీతులు మాత్రం కోటలు దాటేలా మాట్లాడతారు. ఆచరణ చూస్తే పాతాళంలో ఉంటాయి’ అంటూ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.