Pawan Kalyan: సనాతన సేనాని.. తొక్కిసలాట ఘటనను ఎవరి ఖాతాలో వేస్తారు..?
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. తనను తానే ఓ సనాతన సేనానిగా ఊహించుకుంటూ తిరుమల పవిత్రత జోలికి ఎవరైనా వస్తే ఊరుకోబోమంటూ హెచ్చరించారు. చివరకు లడ్డూ కల్తీ వ్యవహారానికి కూటమి ప్రభుత్వంతో సంబంధంతో లేదని, అది గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిన కుట్ర అని, ‘కల్తీ’ వ్యవహారాన్ని జగన్ ఖాతాలో వేసేశారు.
అభిమానుల మృతి పట్ల ఇలా..!
ఇక, ఇటీవల ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముగించుకొని ఇంటికెళుతున్న ఇద్దరు మెగా అభిమానులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఒక డిప్యూటీ సీఎంగా, సినిమా స్టార్గా ఈ ఘటన పట్ల ఎంతో బాధ్యతగా ఉండాల్సిన పవన్.. గత ప్రభుత్వం రోడ్లు సరిగా వేయకనే ప్రమాదం జరిగిందని.. ఆ ప్రమాదాన్నీ వైసీపీ ఖాతాలోనే వేశారు. పైగా మృతి చెందిన ఇద్దరు అభిమానుల కుటుంబాలను కనీసం పరామర్శించకుండా చెరో రూ. 5 లక్షల పరిహారం ప్రకటించి వదిలేశారు.
మరి ఇది ఎవరి ఖాతాలో..?
టీటీడీ చరిత్రలోనే ఎప్పుడూ జరగని విధంగా దుర్ఘటన చోటు చేసుకోవడం పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వైకుంఠ ద్వార దర్శనార్థం వచ్చిన భక్తులతో టీటీడీ అధికారులు, పోలీసులు దారుణంగా వ్యవహరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గంటల తరబడి క్యూలైన్లలో ఉన్న భక్తులకు సరైన సమన్వయం, సమాచారం లేకపోవడంతోనే తొక్కిసలాట జరిగి, ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోవడం, 40 మందికి పైగా గాయాల పాలవడంపై పౌర సమాజం భగ్గుమంటోంది. మరి తిరుమల తొక్కిసలాట ఘటనను ఎవరి ఖాతాలో వేస్తారంటూ సోషల్ మీడియాలో పవన్పై పలువురు నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.