Pawan Kalyan: పవన్ మాటను లెక్క చేయని టీటీడీ ఛైర్మన్..!
కూటమి ప్రభుత్వంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటకు లెక్కే లేకుండాపోయింది. ఆయన పరిస్థితి ‘దారిన పోయే దానయ్య’ అన్నట్లుగా మారిపోయింది. తిరుపతి తొక్కిసలాట ఘటననపై పవన్ కళ్యాణ్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఏఈవో వెంకయ్య చౌదరి, అలాగే బోర్డు సభ్యులంతా మీడియా సమావేశం నిర్వహించి క్షమాపణ చెప్పాల్సిందేనని పవన్ ఆదేశాలు కూడా ఇచ్చారు. ‘నేను క్షమాపణ చెప్పినప్పుడు.. మీరు చెప్పడానికి ఏంటి నామోషీ? మీ తప్పు లేదంటే ఎలా? నేను మాత్రం దోషిగా నిలబడాలా? వీఐపీ ట్రీట్మెంట్ తగ్గి.. కామన్ మ్యాన్ ట్రీట్మెంట్ పెరగాలి’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్కి షాకిచ్చిన నాయుడు!
అయితే, పవన్ ఆదేశాల్ని టీటీటీ ఛైర్మన్ లెక్కచేయకపోవడం సరికదా, ఆయన వ్యాఖ్యల్ని తీసిపారేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పవన్ మాట్లాడిన కొద్దిసేపటికే టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు షాక్ ఇచ్చారు. క్షమాపణ చెప్పడంలో తప్పు లేదన్న ఆయన.. అయితే చెప్పినంత మాత్రాన జరిగిన నష్టం పోదు కదా? అని ప్రశ్నించారు. అంతేకాదు, ఎవరో ఏదో మాట్లాడారని, వాటన్నింటికి స్పందించాల్సిన అవసరం లేదని బీఆర్ నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే జనసేన శ్రేణులు బీఆర్ నాయుడుపై మండిపడుతున్నారు. పవన్ మాటను లెక్కచేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎవరిని చూసి ఈ ధైర్యం అంటూ ప్రశ్నిస్తున్నారు.