Vijayasai Reddy: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా.. విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. రేపు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని తెలిపారు. అయితే తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరనని స్పష్టంచేశారు. తన భవిష్యత్తు వ్యవసాయం అని పేర్కొన్నారు. అయితే విజయసాయి రెడ్డి ప్రకటనపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇంత సడెన్గా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రశ్నార్థకంగా మారింది.
వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటాను!
‘రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి 2025, జనవరి 25 తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీలోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్కి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకి సదా కృతజ్ఞుడిని. జగన్కి మంచి జరగాలని కోరుకుంటున్నా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.’ అని ట్వీట్ చేశారు.