
Dhoni: జార్ఖండ్ ఎన్నికల బ్రాండ్ అంబాసిడర్గా ఎంఎస్ ధోనీ
జార్ఖండ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బ్రాండ్ అంబాసిడర్గా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యవహరించనున్నారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ రవికుమార్ తెలిపారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు అవగాహన కల్పించే కార్యక్రమంలో తన ఫొటోను ఈసీ వినియోగించుకునేందుకు ధోనీ సమ్మతి తెలిపారు. ఇతర వివరాలపై త్వరలోనే ఆయనతో సంప్రదింపులు జరుపుతాం. ఓటర్లలో ఓటుహక్కుపై చైతన్యం కలిగించేందుకు ధోనీ కృషి చేస్తారని భావిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు.
ఓటర్లలో అవగాహన కోసం!
స్వీప్ (సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్) కార్యక్రమంలో భాగంగా ఓటర్లలో అవగాహన పెంచేందుకు ధోనీ కృషి చేయనున్నారు. మొత్తం 81 స్థానాలకు నవంబరు 13, 20న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 23న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. శుక్రవారంతో నామినేషన్ల ప్రక్రియ సైతం పూర్తయింది.