BRS: కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ విమర్శలు
కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజులు దాటినా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, ఏ ఒక్క వర్గానికి ఈ ప్రభుత్వ హయాంలో మేలు జరగడం లేదని అన్నారు. హామీల అమలులో కాంగ్రెస్ నేతలు చిత్తశుద్ధి చూపించడం లేదని ఆరోపించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో ఎండిన పంటలకు ఎకరానికి రూ. 25,000 నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ రైతు దీక్ష కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రసమయి బాలకిషన్తో పాటు శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
ALSO READ: ఇది కాలం తెచ్చిన కరువా? కాంగ్రెస్ తెచ్చిన కరువా?: కేసీఆర్
ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని చెప్పారు. గత పదేళ్లలో రైతులకు కష్టాలు రాలేదని.. కాంగ్రెస్ వచ్చిన వంద రోజుల్లోనే కష్టాలు వచ్చి పడ్డాయని ధ్వజమెత్తారు. అసత్య ప్రచారాలతో ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిందని విమర్శించారు. రైతులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.