
BRS vs Congress: బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర ఘర్షణ.. తోపులాట!
కరీంనగర్ కలెక్టరేట్లో ఆదివారం నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. మాటలతో ఆగలేదు. ఒకరినొకరు తోసుకున్నారు. ఈ సమావేశంలో జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నాడు. ‘‘నువ్వు ఏ పార్టీలో గెలిచి, ఏ పార్టీలోకి వెళ్లావు. అసలు నీది ఏ పార్టీ’’ అంటూ కౌశిక్ రెడ్డి నిలదీశారు. ఎమ్మెల్యే సంజయ్కు మైక్ ఇవ్వొద్దని కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. తనకు ఎందుకు మైక్ ఇవ్వకూడదని సంజయ్ ప్రశ్నించగా.. ఏ పార్టీనో ముందు చెప్పి మాట్లాడాలని వాగ్వాదానికి దిగారు. సంజయ్ మాట్లాడుతుండగా అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇరువురు నాయకుల మధ్య మాటా మాటా పెరిగి పరస్పరం తోసుకున్నారు. అక్కడే ఉన్న నాయకులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
సోషల్ మీడియాలో వైరల్..!
అక్కడే ఉన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా, కౌశిక్రెడ్డి వెనక్కి తగ్గకపోవడంతో సమావేశం నుంచి పోలీసులు ఆయనను బయటకు లాక్కెళ్లారు. అనంతరం కౌశిక్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ మారిన సంజయ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.