
TG: ప్రభుత్వ ఖజానాకు కిక్కిచ్చిన మందుబాబులు.. రూ. వెయ్యి కోట్ల ఆదాయం!
తెలంగాణలో దసరా పండక్కి మద్యం ఏరులై పారింది. మద్యం విక్రయాలు మరోసారి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పండగ జరిగిన పది రోజుల్లోనే రాష్ట్రంలో దాదాపు వెయ్యి కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. బార్లు, మద్యం దుకాణాలతో పాటు పబ్బుల్లోనూ విక్రయాలు భారీగా పెరిగాయి. దీంతో ఖజానాకు మద్యం భారీగా ఆదాయం సమకూరింది. హైదరాబాద్ నగరంలోనే భారీ విక్రయాలు జరిగినట్లు అధికారులు తేల్చారు. పండుగ చివరి రోజైన శని, ఆదివారాల్లో అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. దీంతో మద్యం విక్రయాల ద్వారా రాష్ట్ర ఖజానాకు తక్కువ కాలంలోనే భారీగా ఆదాయం సమకూరింది.
భారీగా ఆదాయం..
రాష్ట్రంలో 2,260 మద్యం దుకాణాలు, 1,171 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటితో పాటు పబ్బుల్లోనూ మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో ఏటా దసరా సందర్భంగా మద్యం విక్రయాలు భారీగానే జరుగుతుంటాయి. ఈసారి కూడా అదే అంచనాతో ఎక్సైజ్ శాఖ ముందస్తుగా భారీ మద్యం నిల్వలను సిద్ధం చేసింది. అదే విధంగా ఆర్డర్లు వచ్చాయి. బార్లు, మద్యం దుకాణాల్లో భారీగా నిల్వలు ఉంచారు. దసరా ప్రారంభానికి ముందే అమ్మకాల జోరు మొదలైంది. సెప్టెంబర్ 30, 2024 వరకు 2,838.92 కోట్ల అమ్మకాలు జరిగాయి. ఇక అక్టోబర్ ప్రారంభం నుంచి 11వ తేదీ వరకు రూ.1,057.42 కోట్ల విలువైన 10.44 లక్షల కేసుల మద్యం విక్రయించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అదేవిధంగా 17.59 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉండగా, కరీంనగర్, నల్గొండ, వరంగల్ జిల్లాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పండుగ చివరి మూడు రోజులు అంతకు మించి అమ్ముడుపోయాయి. ఎక్సైజ్ డిపోల నుంచి రూ.205.42 కోట్ల విలువైన మద్యం రిటైల్ షాపులకు చేరింది. అందులో మద్యం, బీరు విక్రయాలు పోటీ పడ్డాయి. మనోళ్లు మద్యం తాగి మద్యానికే మత్తెక్కించేలా రికార్డు సృష్టించారు.