Earthquake: తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టించిన భూప్రకంపనలు!
ఇవాళ ఉదయం తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భూప్రకంపనలు ప్రజల్ని తీవ్ర భయాందోళనకు గురిచేశాయి. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో తెలంగాణలోని హైదరాబాద్, హనుమకొండ, వరంగల్, కొత్తగూడెం, చర్ల, ఖమ్మంలోని మణుగూరు సహా పలు చోట్ల భూమి కంపించింది. ఏపీలోని విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం, కృష్ణా జిల్లాలో భూమి కంపించింది. భూకంపంతో ప్రజలు భయంతో ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.
55 ఏళ్ల తర్వాత!
తెలంగాణలోని ముగులు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదు అయింది. 55 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఈ స్థాయిలో భూకంపం వచ్చిందని హైదరాబాద్లోని సీఎస్ఐఆర్ – ఎన్జీఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. భూకంప కేంద్రం నుంచి 225 కిలో మీటర్ల పరిధిలో ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 3 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ముఖ్యంగా గోదావరి నది పరివాహక జిల్లాల్లో తీవ్రత కాస్త అధికంగా ఉంది. ఇక, ఏపీలోని జంగారెడ్డిగూడెంలోని కొత్త బస్టాండ్ రాజుల కాలనీ తదితర ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించటంతో ఏం జరిగిందో తెలియక ఇళ్లలో నుంచి బయటకు వెళ్లామని స్థానికులు తెలిపారు. అదే విధంగా కొయ్యలగూడెంలో సుమారు ఐదు సెకండ్ల పాటు భూకంపం సంభవించటంతో ఇళ్లలోని వస్తువులు కదిలాయని స్థానికులు పేర్కొన్నారు.