
Hindenburg: అదానీపై సంచలన ఆరోపణలు చేసిన హిండెన్బర్గ్ మూసివేత.. అసలేం జరిగింది?
అదానీ గ్రూప్పై గతంలో సంచలన ఆరోపణలు చేసిన అమెరికాకు చెందిన షార్ట్-సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ తన కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సంస్థ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ కంపెనీ వెబ్సైట్లో ప్రచురించిన ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఈ నిర్ణయం భయం, వ్యక్తిగత సమస్యలు లేదా ఆరోగ్య సమస్యల వల్ల తీసుకోలేదని అండర్సన్ స్పష్టం చేశారు.
అదానీపై తీవ్ర ఆరోపణలు
న్యూయార్క్ కేంద్రంగా ఉన్న ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ను నాథన్ అండర్సన్ 2017లో స్థాపించారు. ఆర్థిక రంగంలో మానవ నిర్మిత కృత్రిమ విపత్తులను గుర్తిస్తుంది. పెట్టుబడులు, రుణాలు, డెరివేటీవ్లను ఇది విశ్లేషిస్తుంది. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం మనదేశానికి చెందిన అదానీ గ్రూప్పై సంచలన ఆరోపణలు చేయడంతో ఆ కంపెనీ షేర్లు దారుణంగా పడిపోయాయి. అదానీ గ్రూప్ తమ నమోదిత కంపెనీల షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచిందని 2023 జనవరి 23న వెలువడిన హిండెన్బర్గ్ నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలా విలువ పెరిగిన షేర్లను తనఖా పెట్టి రుణాలను పొందిందని ఆరోపించింది. అకౌంటింగ్ మోసాలకు సైతం పాల్పడినట్లు పేర్కొంది. అప్పట్లో ఈ అంశంపై భారత రాజకీయాలను కుదిపేసింది. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అదానీ గ్రూపు సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా ప్రయోజనాలు చేకూరుస్తోందంటూ ఇండియా కూటమి నేతలు పార్లమెంటులో చర్చకు పట్టుబట్టారు. ఈ అంశంపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై స్పందించిన కోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసి మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీని ఆదేశించింది. ఉద్దేశపూర్వకంగా కొన్ని వాస్తవాలను వక్రీకరించారని ఆరోపిస్తూ షార్ట్ సెల్లర్కు సెబీ నోటీసులు జారీ చేసింది.