
IND vs NZ: నిరాశ పర్చిన రోహిత్.. తొలి రోజు ముగిసిన ఆట!
పుణే వేదికగా భారత్, న్యూజిలాండ్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్.. మొదటి ఇన్నింగ్స్లో 259 పరుగులకు ఆలౌటైంది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ను ఆరంభించిన టీమిండియాలో ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ (0) డకౌట్గా వెనుదిరిగి నిరాశపర్చాడు. టిమ్ సౌథీ బౌలింగ్లో రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి జట్టు స్కోరు ఒక పరుగు మాత్రమే. తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 16/1 స్కోరుతో ఉంది. శుభ్మన్ గిల్ (6 బ్యాటింగ్ ), యశస్వి జైస్వాల్ (10 బ్యాటింగ్) నాటౌట్గా క్రీజులో ఉన్నారు. భారత్ ఇంకా 243 పరుగుల వెనుకంజలో ఉంది.
వాషింగ్టన్ సుందర్ రికార్డు!
ఇక న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్ డేవాన్ కాన్వే (76; 141 బంతుల్లో 11 ఫోర్లు) హాఫ్ సెంచరీ కొట్టాడు. రచిన్ రవీంద్ర (65; 105 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి మెరిశాడు. మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. 45 నెలల తర్వాత భారత టెస్టు జట్టులోకి వచ్చిన స్పిన్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ (7/59) న్యూజిలాండ్ ఆలౌట్ కావడంలో కీలకపాత్ర పోషించాడు. టెస్టుల్లో అతడు ఐదు వికెట్ల కంటే ఎక్కువ పడగొట్టడం ఇదే తొలిసారి. ఇక, రవిచంద్రన్ అశ్విన్ (3/59) కూడా రాణించాడు.