IND vs AUS: హైదరాబాద్ ఫ్యాన్స్కు మరోసారి నిరాశే.. భారత్, ఆసీస్ మ్యాచ్ వేదిక మార్పు!
వన్డే వరల్డ్ కప్-2023 ముగిసిన తర్వాత సొంతగడ్డపై భారత్.. ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే చివరి టీ20 మ్యాచ్ డిసెంబర్ 3న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. కాగా, ఇదే రోజు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉండటంతో మ్యాచ్ నిర్వహణ జరుగుతుందా? లేదా ? అనే విషయంపై గత కొంతకాలంగా గందరగోళం నెలకొంది. తాజాగా, ఈ మ్యాచ్ను హైదరాబాద్ నుంచి బెంగళూరుకు తరలించిన్నట్లు సమాచారం. దీంతో ఉప్పల్ వేదికగా జరగనున్న ఐదో టీ20 మ్యాచ్ చూద్దామని అనుకున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.
భద్రత కల్పించలేం
ఎన్నికల కౌంటింగ్, శాంతిభద్రతలపై పోలీసు శాఖ దృష్టి సారించడంతో మ్యాచ్కు పూర్తి స్థాయిలో భద్రత కల్పించలేమని తెలంగాణ పోలీసులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ)కు తేల్చి చెప్పారు. మరోవైపు వైజాగ్లో ఈ నెల 23న జరగాల్సిన తొలి టీ20ని హైదరాబాద్కు కేటాయించి, చివరి మ్యాచ్ను వైజాగ్కు మార్చాలని బీసీసీఐని రిక్వెస్ట్ చేయాలని హెచ్సీఏ ఆలోచన చేస్తోందని సమాచారం. అయితే ప్రస్తుతం ఉప్పల్ స్టేడియంలో సౌత్ స్టాండ్ పైకప్పు నిర్మాణం, కొత్త కుర్చీల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తొలి టీ20 మ్యాచ్ జరిగేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ఈ నిర్ణయాన్ని బీసీసీఐ పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది.