My Stupidity అతడిని సీఎం చేయడం నా ఖర్మ.. అసలు తెలివి ఉందా
జనాభా నియంత్రణపై మాట్లాడుతూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) మళ్లీ నోరు జారారు. సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘అతడిని సీఎం చేయడం నా మూర్ఖత్వం’ అని పేర్కొన్నారు. ఆయన ఇంకా సీఎంగా భావిస్తున్నారని మండిపడ్డారు. బిహార్ (Bihar) శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో బీసీ గణనపై చేపట్టిన చర్చలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇటీవల చేపట్టిన కుల గణనపై (Caste Based Census) చర్చించారు. గురువారం చర్చల్లో భాగంగా మాజీ సీఎం, హిందూస్థానీ ఆవామ్ మోర్చా (సెక్యులర్) పార్టీ వ్యవస్థాపకులు జితన్ రామ్ మాంఝీ (Jitan Ram Manjhi) మాట్లాడారు. ‘కుల గణన సక్రమంగా చేపట్టలేదు. కులం ప్రాతిపదికన ఈ సర్వే సక్రమంగా చేపట్టినట్లు మేం భావించడం లేదు. లెక్కలు అన్ని తప్పుల తడకగా ఉన్నాయి. దీనివలన అర్హులైన వారికి లబ్ధి చేకూరదు’ అని మాంఝీ మాట్లాడారు.
చదవండి: సీఎం కేసీఆర్ నిజంగా దొరనే! ఆయన ఆస్తులు ఎంతో తెలుసా..?
ఈ ప్రసంగంపై ప్రతిస్పందించిన సీఎం నితీశ్ మాట్లాడుతూ.. ‘మేం అతడిని ముఖ్యమంత్రిని (Chief Minister) చేశాం. ఆయన ఇంకా సీఎం అని భావిస్తున్నారు. ఆయనకు అసలు తెలివి ఉందా. నా మూర్ఖత్వం (My Stupidity) కొద్ది అతడిని సీఎం చేశాం’ అని తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు అసెంబ్లీలో (Assembly) తీవ్ర దుమారం రేపాయి. ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేయడంతో అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది. స్పీకర్ (Speaker) నిలువరించే ప్రయత్నాలు చేసినా సభ అదుపులోకి రావడంతో రేపటికి వాయిదా వేశారు. కాగా, మాంఝీని ఉద్దేశించి సీఎం నితీశ్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.