Prajapalana: తెలంగాణలో ప్రజపాలన షురూ.. వెల్లువలా దరఖాస్తులు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఈ కార్యక్రమం జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచే అన్ని గ్రామాల్లో గ్రామసభలు ప్రారంభమయ్యాయి. మహిళలు, పురుషులు, దివ్యాంగులకు వేరువేరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ప్రతీ 100 దరఖాస్తుదారులకు ఒక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఇక రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 మున్సిపల్ వార్డులతో కలిపి మొత్తం 16,395 ప్రాంతాలలో ప్రజాపాలన సదస్సులు కొనసాగుతున్నాయి.
Also read: Amit Shah: నేడు రాష్ట్రానికి కేంద్రమంత్రి అమిత్ షా.. టూర్ షెడ్యూల్ ఇదే!
గ్రామ సభలు నిర్వహించడానికి 3, 714 అధికార బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమం పర్యవేక్షణకు అన్ని ఉమ్మడి జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రభుత్వం నియమించింది. ప్రజాపాలన కార్యక్రమం మానిటరింగ్ చేయడానికి ప్రతీ జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటును చేశారు. అభయహస్తం కింద మహాలక్ష్మి, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లను చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిల్స్ కు గానూ 30 మంది స్పెషల్ ఆఫీసర్లను జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ నియమించారు. ప్రజా పాలన అమలు కోసం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఆరు జోన్లకు ఆరుగురు ఐఏఎస్ ఆఫీసర్లను ఇంఛార్జ్ గా ప్రభుత్వం నియమించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 600 కౌంటర్స్ ఏర్పాటు చేశారు. విధుల్లో 5 వేల మంది సిబ్బంది ఉండనున్నారు. మరో 5వేల మంది వాలంటీర్లు ఉన్నారు. ఒక వార్డులో నాలుగు టీమ్స్, ప్రతి టీంలో ఏడుగురు సిబ్బంది ఉన్నారు.