Congress: ప్రజాపాలన దరఖాస్తులు నిరంతర ప్రక్రియ: భట్టి విక్రమార్క
ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నెల రోజుల వరకు కొనసాగుతుందని, అప్పటి వరకు కౌంటర్లు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. అబ్ధుల్లాపూర్ మెట్ లో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆరు గ్యారెంటీల కోసం ప్రజలు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో ఆగమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: వైసీపీలో చేరిన అంబటి రాయుడు.. అక్కడి నుంచే పోటీ?
ఇది ప్రజల ప్రభుత్వమని, ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చి తీరుతామని చెప్పారు. తొమ్మిదేండ్ల నుంచి పెన్షన్ రాలేదని ప్రజలు చెబుతున్నారన్నారు. తాను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేపట్టిన పాదయాత్ర సందర్భంగా చాలా మంది ప్రజలు ఇదే ఆవేదనను వ్యక్తం చేశారని భట్టి అన్నారు. ఇవాళ్టి నుంచి నెల రోజుల వరకు కౌంటర్ల ఉంటాయని, ఆ తర్వాత కూడా దరఖాస్తులు చేసుకొనేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ పథకాల కోసం అన్ని పార్టీల కార్యకర్తలు దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు.
Also Read: ప్రజలకు సీఎం జగన్ ‘న్యూ ఇయర్ గిఫ్ట్’.. అర్హులందరికీ అందాలి
తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తమ పార్టీలోకి వస్తేనే ఇల్లు ఇస్తామని బెదిరించే ప్రభుత్వం తమది కాదని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలను పొందలేకపోయారని చెప్పారు. తమది దొరల పాలన కాదని మల్లు భట్టి చెప్పారు. తమ ప్రభుత్వం ఒక వ్యక్తికో, ఒక వర్గానికో సంబంధించినది కాదని అన్నారు.