![](https://pakkatelugu.com/wp-content/uploads/2023/11/bhuma.jpg)
Bhuma Family: టిడిపి- జనసేన పొత్తు.. భూమా సీట్లకే ఎసరు?
ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. పార్టీల అభ్యర్దుల లెక్కలు మారుతున్నాయి. టీడీపీ- జనసేన పొత్తుతో ఆశావహులు అలర్ట్ అవుతున్నారు. ఎక్కడ తమ సీటుకు ఎసరు వస్తుందోనని ముందే తమ నిర్ణయాలు తీసుకుంటున్నారు. టీడీపీ నుంచి సీటు రాదని భావిస్తున్న వారు జనసేన నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో టీడీపీ సీనియర్లకు షాక్ తప్పటం లేదు. అలాగే జనసేన కోసం తమ సీట్లు త్యాగం చేసే పరిస్థితి లేదని కచ్చితంగా చెప్తున్నట్టు సమచారం. ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా భూమా కుటుంబానికి టికెట్ల పంచాయితీ టిడిపికి తలనొప్పిగా మారింది.
పంచాయితీకి కారణం నంద్యాల
ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల సీటును టీడీపీ మాజీ మంత్రి ఫరూక్ కు ఖాయం చేసింది. ఈ నిర్ణయం భూమా కుటుంబంలో..నియోజకవర్గంలో సంచనలంగా మారింది. ఈ సీటు పంచాయితీ పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరింది. 2017 ఉప ఎన్నికల్లో.. భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరఫున విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ ఆయనకే టికెట్ కేటాయించినా.. ఓడిపోయారు. ప్రస్తుతం భూమా బ్రహ్మానందరెడ్డి నియోజకవర్గ ఇంఛార్జ్గా కొనసాగుతున్నారు. పార్టీలో మైనారిటీ వర్గాల ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించి ఫరూక్ కు సీటు కేటాయించారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలో చేరిన వహీద్కు.. కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారు. దీంతో, భూమా కుటుంబానికి నంద్యాల సీటు ఇక లేదనే ప్రచారం సాగుతోంది.
భూమా కుటుంబం పరిస్థితి ఏంటి
ఈసారి ఎన్నికల్లో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ తనకు సీటు ఖాయమనే ధీమాతో ఉన్నారు. అయితే, నియోజకవర్గంలో కొంత కాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. వరుస కేసులు… వివాదాలతో భూమా అఖిల ప్రియకు సీటు ఇస్తారా లేదా .. ఇచ్చినా పార్టీ కేడర్ సహకరిస్తుందా అనే చర్చ మొదలైంది.
దీంతో, అఖిలకు టీడీపీ నుంచి సీటు రాకుంటే పవన్ తో ఉన్న పరిచయంతో ఆ పార్టీ నుంచి సీటు దక్కించుకుంటారనే ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు జనసేనలోకి సీనియర్ నేత రాంపుల్లారెడ్డి చేరటంతో అఖిల సీటు పైన సస్పెన్స్ కొనసాగుతోంది. అటు నంద్యాల, ఇటు ఆళ్లగడ్డ రెండు సీట్ల విషయంలోనూ భూమా ఫ్యామిలీకి సీటు విషయం పై సందిగ్ధత కొనసాగుతోంది. దీంతో, చంద్రబాబు- పవన్ సీట్ల ఖరారు నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరి చూడాలి భూమా కుటుంబం సీట్లు దక్కించుకుంటుందో.. వేరే దారి చూసుకుంటుందో.?