![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/06/modi-chandrababu-780x470.webp)
CBN: ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎన్డీయేను డిమాండ్ చేస్తారా?
సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి సంచలన విజయాన్ని నమోదు చేసింది. 164 అసెంబ్లీ సీట్ల భారీ విజయంతో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు టీడీపీ సొంతంగా 16 ఎంపీ స్థానాలు గెలుపొంది కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో సైతం కీలకంగా మారింది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరాలంటే టీడీపీ మద్దతు కీలకం కానున్న నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు డిమాండ్ చేయాలని పలువురు రాజకీయ నిపుణులు సలహాలిస్తున్నారు. అంతేకాదు, బిహార్లోని జేడీయూ సైతం ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్న తరుణంలో ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ జేడీయూ బీజేపీని డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు కూడా డిమాండ్ చేస్తారా? వేచి చూడాలి.
ALSO READ: ఏపీ కొత్త సీఎస్గా నీరభ్ కుమార్ ప్రసాద్
ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటులో జేడీయూ మాదిరిగానే తాను కూడా కీలకమని గుర్తెరిగి, ప్రత్యేక హోదా కోసం టీడీపీ డిమాండ్ చేస్తుందా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. మరీ ముఖ్యంగా ఏపీకి 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని గతంలో రాజ్యసభ వేదికగా బీజేపీ వాగ్దానం చేసింది. అలాగే 2014 ఎన్నికల ప్రచార సందర్భంలోనూ తిరుపతిలో నాడు ప్రధాని అభ్యర్థిగా మోదీ కూడా ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఆ తర్వాత దాన్ని పక్కన పడేశారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ తీసుకోడానికి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగీకరించారు. కానీ ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ మాత్రం సజీవంగా ఉంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో టీడీపీ కీలకం అయిన నేపథ్యంలో, విభజన హామీల్ని సాధించుకోడానికి ఇదే సరైన సమయమని, బీజేపీపై ఒత్తిడి తేవాలనే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి.
3 Comments