Chandrababu: విజయవాడ దుర్గమ్మ సేవలో చంద్రబాబు.. సంచలన కామెంట్స్
టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు నేడు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం.. చంద్రబాబుకు వేదాశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందించారు.
Read also: AP Ration Scheme: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరలకే సరుకులు
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నా శేష జీవితం ప్రజలకే అంకితం.. ఈ నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడబోను అని స్పష్టం చేశారు. మానవ సంకల్పానికి దేవుని ఆశీస్సులు కోసం ఈ యాత్రకు శ్రీకారం చుట్టానని.. రేపు సింహాచలం అప్పన్న దర్శనం చేసుకుని, 5న శ్రీశైల మల్లికార్జున దర్శనం, అనంతరం దర్గాకు కూడా వెళ్తానన్నారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.
రాష్ట్రంలో మళ్లీ పూర్వ వైభవం వచ్చి ప్రజలకు న్యాయం జరిగేలా ఆశీర్వచనం ఇవ్వాలని కనకదుర్గమ్మను కోరుకున్నట్టు తెలిపారు. ఈ కలియుగంలో త్వరగా ప్రతీదీ మర్చిపోతాం.. ఇబ్బంది పెడితే మర్చిపోం అన్నారు. గచ్చిబౌలీలో జరిగిన ఐటీ ఉద్యోగుల సమీకరణకు ఏకగ్రీవంగా అందరూ వచ్చారు.. నా బాగు కోరి అందరూ అనునిత్యం ప్రార్ధించారు, కొంతమంది ప్రాణ త్యాగాలు చేసుకున్నారు. నిన్న కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడానికి వచ్చిన వెంకటేశ్వరస్వామిని ధర్మాన్ని కాపాడటానికి దర్శనం చేసుకున్నా.. ఇవాళ శక్తి స్వరూపిణి దుర్గమ్మ దర్శనం చేసుకుని దుష్టుల్ని శిక్షించమని కోరానన్నారు.
ఇక, నా కష్టంలో భారతీయులంతా స్పందించారు.. విదేశాల్లో సైతం నాకోసం ప్రార్ధనలు చేశారు. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని చంద్రబాబు అన్నారు. ఇక చంద్రబాబు వెంట ఎంపీ కేశినేని నాని, కేశినేని చిన్ని, మాగంటి బాబు, పోతిన మహేష్, కొల్లు రవీంద్ర, యార్లగడ్డ వెంకట్రావు, పంచుమర్తి అనురాధ, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమా సహా పలువురు టీడీపీ నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు.