![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-17-at-10.18.14-AM-780x465.jpeg)
CM Jagan: మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏడో జాబితాను సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న రాత్రి విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి విజయం సాధించి, అధికారం చేపట్టాలని భావిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. పనితీరు సరిగాలేని సిట్టింగులకు టిక్కెట్లు నిరాకరిస్తున్నారు, కొన్ని చోట్ల మార్పులు-చేర్పులు చేస్తున్నారు. నిరంతరం ప్రజల్లో ఉండే నాయకులకే అవకాశం ఇస్తున్నారు. ఇదివరకు విడుదల చేసిన ఆరు జాబితాల్లోనూ సీఎం జగన్ ఇదే పద్ధతిని పాటించారు.
ALSO READ: మాజీ సీఎం కేసీఆర్ బర్త్ డేకు కవిత స్పెషల్ విషెస్.. ట్వీట్ వైరల్
మహిధర్ రెడ్డికి నో ఛాన్స్
ఇక నిన్న విడుదల చేసిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన ఏడో జాబితాలో కేవలం ఇద్దరు ఇంఛార్జ్ల పేర్లను ప్రకటించారు. కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్ రెడ్డిని కాదని ఇటీవలే పార్టీలో చేరిన పెంచలయ్య కుమార్తె అరవింద యాదవ్కు టికెట్ ఇచ్చారు. అలాగే ఇక పర్చూరు ఇంఛార్జ్గా ఆమంచి కృష్ణమోహన్ను తప్పించి చీరాలకు చెందిన యడం బాలాజీని నియమించారు. బాలాజీ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి చీరాల అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మరోసారి టిక్కెట్ దక్కకపోవడంతో ఆయన టీడీపీలో చేరారు. అయితే కొంతకాలంగా ఆయన టీడీపీకి కూడా దూరంగా ఉంటున్నారు. కొన్నిరోజుల క్రితం అమెరికాలో ఉంటున్న బాలాజీ ఇండియాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన తిరిగి వైసీపీలో చేరి తాజాగా టిక్కెట్ కూడా సాధించారు.
ALSO READ: బీజేపీతో టీడీపీ పొత్తు..తెరపైకి కొత్త ప్రతిపాదనలు!
ఆమంచి.. పోటీ ఎక్కడి నుంచి?
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆమంచి కృష్ణమోహన్కు ఎక్కడ అవకాశం ఇస్తారన్న చర్చ జరుగుతోంది. ముందు నుంచి ఆమంచి పర్చూరులో పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరు. చీరాల నుంచి పోటీ చేయాలని ఆయన చూస్తున్నారు. కానీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరాం తన తనయుడు వెంకటేశ్కి అవకాశం ఇవ్వాలని కోరగా, అధిష్టానం వెంకటేశ్ను చీరాల ఇంఛార్జ్గా నియమించింది. ఆమంచి కూడా అదే స్థానం కోసం పట్టుబడుతుండగా, మరి ఇప్పుడు ఆమంచి కోసం వెంకటేశ్ విషయంలో అధిష్టానం వెనక్కి తగ్గుతుందా అన్నది వేచి చూడాల్సి ఉంది.