![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/nagababu.jpg)
Nagababu: పదిరోజుల్లో జనసేన అభ్యర్థుల ప్రకటన.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు
ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండటంతో రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారాలను ముమ్మరం చేస్తున్నారు. అధికార వైసిపి ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే దూసుకుపోతుండగా.. ప్రతిపక్షపార్టీలు టీడీపీ, జనసేన ఇంకా పొత్తులు కుదుర్చుకునే పనిలోనే ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకురావాలని వైఎస్ షర్మిల వ్యూహాలు రచిస్తున్నారు.
Also read: Rahul Gandhi: ప్రధాని మోడీ ఓబీసీ కాదు.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలోనే విశాఖలో పర్యటిస్తున్న జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సంచలన ప్రకటన చేశారు. మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితాను తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటిస్తారని వెల్లడించారు. అధికార పార్టీ విడుదల చేస్తున్న జాబితాలపై మాట్లాడుతూ.. వైసీపీ ఏడో జాబితా కాదు.. లక్ష జాబితాలు విడుదల చేసినా మాకు నష్టం లేదన్నారు. జనసేన ఎన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలో మా అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారని స్పష్టం చేశారు. పార్టీలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే.. పరిష్కరించుకొని ముందుకు వెళ్తామన్నారు. టీడీపీ-జనసే కూటమితో బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నామన్నారు. టీడీపీ-జనసేన మధ్య పొత్తు ఉంది కాబట్టి.. టీడీపీ నేత చింతకాయల విజయ్ తో మర్యాద పూర్వకంగానే కలిశామన్నారు. ఇదే సమయంలో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ అంశం చర్చకు రాలేదన్నారు. ఇక తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని నాగబాబు వెల్లడించారు.
మరోవైపు అన్ని రంగాల్లో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో అద్భుతం జరగబోతోంది.. అద్భుతం జరిగేటప్పుడు అందరూ సహకరించాలి.. పవన్ కల్యాణ్ కోసం నేను ఏమి చేయడానికి అయినా రెడీ అని ప్రకటించారు నాగబాబు. వైఎస్ జగన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర జాతికి ప్రమాదకరం అన్నారు. కరోనా వైరస్ తరువాత ప్రమాదకర వైరస్ వైసీపీనే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వైరస్ కు జనసేన, టీడీపీయే అసలైన మందుగా అభివర్ణించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్పై వ్యక్తిగత దూషణలు తప్ప.. ఈ ప్రభుత్వంలో అభివృద్ధి లేదని మండిపడ్డారు.