Minister Merugu Nagarjuna: నియోజకవర్గాల మార్పు.. స్పందించిన మంత్రి
ఆంధ్రప్రదేశ్లో అధికార వైసిపిలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. 2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ అధినేత, సీఎం జగన్ వేగంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా 11 నియోజకవర్గాల్లో కొత్త వారికి బాధ్యతలు అప్పగించింది. ఇందులో 5 ఎస్సీ రిజర్వర్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి. మొదటి ఫేజ్లో నలుగురికి స్థాన చలనం కల్పించారు. మంత్రి ఆదిమూలపు సురేష్కు కొండేపి, మేకతోటి సుచరితకు తాడికొండ, మేరుగ నాగార్జునకు సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించారు. మరో మంత్రి విడుదల రజినికి చిలకలూరిపేట నుంచి గుంటూరు పశ్చిమ బాధ్యతలను సీఎం జగన్ అప్పగించారు. అయితే, నియోజకవర్గ మార్పుపై తొలిసారి స్పందించిన మంత్రి మేరుగ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also read: Janasena: జనసేనానికి లేని సొంత అజెండా.. ఎన్నాళ్లింకా పరుల చెంతా
తనకు నియోజకవర్గం మార్పుపై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. వేమూరు నియోజకవర్గం నుంచి మూడు సార్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి బొమ్మపై గెలిచాను. ఇప్పుడు సంతనూలపాడు నియోజకవర్గానికి ఇంఛార్జ్గా ఉన్నానని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఎక్కడ ఆదేశిస్తే అక్కడ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అంతేకాదు, ఎమ్మెల్యేల్లో ఎవరికీ అసంతృప్తి లేదు. అందరూ మా వాళ్లే.. అందరూ సీఎం వైఎస్ జగన్ కోసం పనిచేస్తారని పేర్కొన్నారు. వేమూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి మేరుగ నాగార్జునకు సంతనూతలపాడు బాధ్యతలు అప్పగించారు. గ్రూపు తగాదాలున్న కొండేపి విషయంలో జగన్ కఠినంగా వ్యవహరించారు. కొండేపి ఇన్చార్జ్గా ఉన్న వరికుటి అశోక్ బాబును.. పార్టీలో ఓ వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. టికెట్ ఇస్తే ఓడిస్తామని సొంత పార్టీ నేతలు హెచ్చరించడంతో.. వరికూటి అశోక్బాబుకు వేమూరు బాధ్యతలు అప్పగించారు.