Jagan Fails: సీఎం జగన్ 85 శాతం ఫెయిల్.. నవరత్నాలు నవమోసాలయ్యాయి
అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని వైఎస్ జగన్ పై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నవరత్నాలు పేరిట ప్రజలను నిండా ముంచారని.. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా టీడీపీ ‘జగన్ రెడ్డి హామీల అమలులో 85 శాతం ఫెయిల్’ అనే పుస్తకం విడుదల చేసింది. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆ పుస్తకాన్ని పార్టీ సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు, బోండా ఉమా తదితరులు విడుదల చేశారు.|
Also Read ఏపీకి కంపెనీల క్యూ.. ఫలిస్తున్న గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాలు
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘99 శాతం హామీలు అమలు చేశారని సీఎం జగన్ అబద్ధం చెబుతున్నారు. 730 హామీలు ఇచ్చి 109 మాత్రమే అమలు చేశారు. 15 శాతం హామీలు అమలు చేసి 85 శాతం ఎగ్గొట్టారు. 109 హామీలు మాత్రమే నెరవేర్చారు. మేనిఫెస్టోను బైబిల్ తో సమానంగా భావించే జగన్ రెడ్డి మేనిఫెస్టోలో చెప్పినవి ఎందుకు అమలు చేయడం లేదో ప్రజలకు చెప్పాలి’ అని సవాల్ విసిరారు. ఏపీపై సీఎం జగన్ అప్పుల కుప్ప మోపుతున్నారని ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారని అచ్చెన్నాయుడు తెలిపారు.
Also Read సింగరేణి ఎన్నికల్లో ఎర్రజెండా రెపరెపలు.. పత్తా లేని బీఆర్ఎస్ పార్టీ
బటన్ నొక్కుడు ద్వారా ప్రజలకు అందించిన సహాయం కేవలం రూ.2.40 లక్షల కోట్లు అని, మిగిలిన సొమ్ము ఎక్కడికి పోయిందని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. బటన్ నొక్కుడు ముసుగులో బొక్కింది ఎంతో చెప్పాలని కోరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళిక నిధులను కూడా దారి మళ్లించి ఆయా ప్రజల నోట్లో మట్టికొట్టిన ఘనుడు జగన్ రెడ్డి అని విమర్శించారు. ఇసుకను దోచేసి వేల కోట్లు కొల్లగొడుతూ 125కు పైగా వివిధ వృత్తుల వారి కడుపులపై కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మద్య నిషేధం, సీపీఎస్ రద్దు హామీలతో మహిళలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులను మోసం చేశారని మండిపడ్డారు. తన పదవీ కాలంలో ప్రజలకు ఇది చేశానని చెప్పే ధైర్యం జగన్ కు ఉందా? అని సవాల్ విసిరారు. ప్రచురించిన పుస్తకాన్ని ఒకసారి చదివి చూసుకోవాలని చెప్పారు. జగన్ మోసాలను గ్రహించిన ప్రజలు టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అచ్చెన్నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.