![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/bjp-1.jpg)
BJP: తెలంగాణలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ ఫోకస్.. ఆరుగురు ఖరారు
పార్లమెంట్ ఎన్నికలను తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు సీరియస్గా తీసుకున్నారు. కీలక నేతలంతా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి సత్తాచాటి పరువు నిలుపుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణలో 6 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసింది. నలుగురు సిట్టింగుల్లో ముగ్గురికి మళ్లీ టికెట్ ఇచ్చింది. సికింద్రాబాద్- కిషన్ రెడ్డి, కరీంనగర్- బండి సంజయ్, నిజామాబాద్- అర్వింద్, చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం- డాక్టర్ వెంకటేశ్వరరావు, భువనగిరి- బూర నర్సయ్య గౌడ్ ను అభ్యర్థులుగా ఖరారు చేసింది.
Also read: Minister Gopala Krishna: టీడీపీ- జనసేన తొలి జాబితా.. మంత్రి గోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
మరోవైపు.. మహబూబ్నగర్ స్థానం నుంచి డీకే అరుణ్, జితేందర్ రెడ్డి ఇద్దరూ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇద్దరిలో ఒకరి పేరును నాయకత్వం ఖరారు చేసే అవకాశం ఉంది. మల్కాజిగిరి, జహీరాబాద్ నియోజకవర్గాలకు ఎక్కువ మంది పోటీపడుతున్నారు. మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు ఈటల రాజేందర్ ఆసక్తి చూపుతుండగా.. జాతీయ నేతల్లో మురళీధర్ రావు పేరు కూడా బలంగా వినిపిస్తుంది. మరోవైపు మల్కాజ్గిరి నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతి మల్క కొమురయ్య పేరును కూడా పార్టీ నాయకత్వం పరిశీలిస్తుంది.
ఇదిలా ఉంటే.. తెలంగాణలో ఒంటరిగా పోటీ చేసేందుకే బీజేపీ మొగ్గుచూపింది. బీఆర్ఎస్తో పొత్తు ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి కిషన్ రెడ్డి ఇప్పటికే తెరదించారు. ఈ క్రమంలోనే విజయ సంకల్ప యాత్రలను ప్రారంభించి రాష్ట్రాన్ని చుట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీజేపీకి సానుకూలత పెరిగిందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీ అధిరాకంలో ఉన్న దేశంలో మోడీ ఉండాలనే నిదానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.