![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/06/heavy-rain1-1688898039-780x470.jpg)
Heavy Rains: ఢిల్లీని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు!
మొన్నటి దాకా ఉక్కపోతలతో అల్లాడిపోయిన ఢిల్లీ వాసులను ఇప్పుడు వర్షాలు అతాలకుతలం చేస్తున్నాయి. గత 24 గంటల్లో సఫ్దార్జంగ్లో 228.1 మిల్లీమీటర్ల వాన పడింది. నిన్న రాత్రి కేవలం 3 గంటల వ్యవధిలో 148.5 మి.మీ. కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లోకి పెద్ద మొత్తంలో వరదనీరు వచ్చి చేరింది. చాలా కాలనీల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్లు ఏర్పడ్డాయి. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో రాకపోకలపై ప్రతికూల ప్రభావం చూపింది. చాలా విమాన సర్వీసుల్లో జాప్యం చోటుచేసుకొంది. దక్షిణ ఢిల్లీలో గోవిందపురి ప్రాంతంలో వరద నీరు భారీగా చేరడంతో వాహనాలు నిలిచిపోయాయి.
ALSO READ: బీఆర్ఎస్ను కలవరపెడుతున్న ఫిరాయింపులు.. కేసీఆర్ కీలక సమావేశం
నగరంలో చాలా ట్రాఫిక్ సమస్యలు తలెత్తడంతో ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందికరమైన మార్గాల వివరాలను ఎక్స్లో పోస్టు చేశారు. శాంతివన్ నుంచి ఐఎస్బీటీ వరకు అవుటర్ రింగ్రోడ్డు రెండువైపులా ప్రయాణించలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. అనువర్త మార్గంలో కూడా ట్రాఫిక్కు ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. విమానాశ్రయంలో టెర్మినల్-1 పైకప్పులో కొంతభాగం శుక్రవారం తెల్లవారుజామున కుప్పకూలింది. ట్యాక్సీలు సహా పలు కార్లపై పడటంతో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. శిథిలాల కింద ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆయన్ని రక్షించారు. జూన్ 30వ తేదీన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
2 Comments