Congress: కాంగ్రెస్ ముందున్న సవాల్… 6 గ్యారెంటీలకు 60 వేల కోట్లు
తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపులో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు ఆర్థికశాఖ కేటాయించారు. ఈ నేపథ్యంలోనే ఆర్థికశాఖ కార్యదర్శులు, అధికారులతో భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాలు తదితర అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2014 జూన్ రెండో తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ఆదాయం, వ్యయం, కలిగిన ప్రయోజనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. అందుకు సంబంధించిన అంశాలపై కూడా భట్టి విక్రమార్క అధికారులతో చర్చించారు.
Also Read: కేసీఆర్ కు సీఎం పరామర్శ.. త్వరగా అసెంబ్లీకి రావాలని ఆకాంక్ష
100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు
ఇచ్చిన ప్రతి హామీ అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని… ఆరు గ్యారంటీల్లో 2 గ్యారంటీలను 2 రోజుల్లోనే ప్రారంభించామని తెలిపారు. రాష్ట్ర వనరులను సంపద సృష్టికి వాడుతామని.. సృష్టించిన సంపదను ప్రజలకు పంచడమే కాంగ్రెస్ అజెండా పనిచేస్తామని హామీ ఇచ్చారు. పరిశ్రమలు, ఐటీ, సేవారంగాన్ని ప్రోత్సహిస్తామని… ఆరు గ్యారంటీలను మొదటి వంద రోజుల్లో అమలు చేస్తామని వెల్లడించారు. ఆరు గ్యారంటీలకు వారంటీ లేదని బీఆర్ఎస్ విమర్శించిందని… వారంటీ లేదన్న పెద్దలకు చెంపదెబ్బ తగిలేలా ప్రజలు చేశారని భట్టి వ్యాఖ్యానించారు.
Also Read: కేంద్రమంత్రిని కలుస్తా.. మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్
6 గ్యారెంటీలకు 60 వేల కోట్లు
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు ఏడాదికి 50 వేల నుంచి 60 వేల కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. ఒక్కో గ్యారంటీతో ప్రభుత్వంపై పడే భారం ఎంత అనేదానిపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. మహాలక్ష్మి స్కీమ్ శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఇన్సూరెన్స్ పెంపు కూడా అమల్లోకి తెచ్చారు. అలాగే ఇండ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో దాదాపు 4 వేల కోట్ల భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ పథకంలో ఇల్లు లేనివారికి ఇంటి స్థలం, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటిస్థలం ఇవ్వనున్నారు.
Also Read: కాంగ్రెస్ ఆరోగ్యశ్రీ పథకం… ఇవి మీకు తెలుసా?
రైతు భరోసాకే 21 వేల కోట్లు
దీనికి కూడా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని తెలుస్తోంది. ఈసారి రైతులకు, కౌలుదారులకు ‘రైతు భరోసా’ పేరిట పెట్టుబడి సాయం అందించనున్నారు. ఏటా ఎకరాకు 15 వేలు, వ్యవసాయ కూలీలకు 12 వేల చొప్పున ఇవ్వనున్నారు. ఈ స్కీమ్ కే 21 వేల కోట్లు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఒక దఫాకు 10,500 కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉంటుంది. వీటితోపాటు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత,- చేనేత కార్మికులు, హెచ్ఐవీ,- బోదకాలు బాధితులు, డయాలసిస్ చేయించుకుంటున్నవారికి నెలవారీ పింఛన్ 4 వేలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతినెలా 1,500 కోట్ల నుంచి 2 వేల కోట్ల వరకు అవుతాయని అంటున్నారు.