Revanth Reddy: 1000 ఎకరాలు గుర్తించండి… అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశం
తెలంగాణలో నూతన పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)కు అవతల, రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)కు లోపల 500 నుంచి 1000 ఎకరాల భూమిని గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆ భూములు కూడా విమానాశ్రయాలకు, జాతీయ రహదారులకు వంద కిలో మీటర్ల లోపు ఉండేలా చూడాలని సూచించారు.
Also Read: భారీ గుడ్ న్యూస్.. రేషన్ కార్డులకు అప్లై చేస్తున్నారా!
బంజర భూములై ఉండాలి
రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిపై సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల కోసం సేకరించే భూములు బంజరు భూములై ఉండటంతో పాటు సాగుకు యోగ్యం కానివి అయి ఉండాలన్నారు. రైతులకు ఎలాంటి నష్టం లేకుండా… కాలుష్యం తక్కువగా ఉండేవిధంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. అదే సమయంలో పరిశ్రమలకు కేటాయించినప్పటికీ… ఉపయోగించకుండా ఉన్న వాటిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. కాలుష్యరహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వాలని, హైదరాబాద్లోని నాచారం, జీడిమెట్ల, కాటేదాన్ తదితర పారిశ్రామికవాడల విషయంలో ప్రత్యామ్నాయాలను సూచించాలన్నారు.
Also Read: ఏపీ పాలన భేష్.. అంతర్ రాష్ట్ర మండలి ప్రశంసల వర్షం
సోలార్ పవర్ ఉపయోగించాలి
రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో ప్రభుత్వ, నిరుపయోగ, బంజరు భూములను గుర్తించి పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యతనివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇవి నివాస ప్రాంతాలకు దూరంగా ఉండాలన్నారు. దీనివల్ల ఆయా భూముల ధరలు తక్కువగా ఉండడంతోపాటు భూసేకరణకు రైతులు కూడా సహకరిస్తారని అన్నారు. పరిశ్రమలకు థర్మల్ విద్యుత్ కాకుండా సోలార్ పవర్ ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలోని ఊర్లను మోడల్ గ్రామాలుగా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యతనిస్తూ ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.