TS Elections: బీఆర్ఎస్ టైం అయిపోయింది.. గద్వాల సభలో అమిత్ షా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో అన్ని పార్టీల నాయకులు పర్యటనలతో ప్రచారాలు హోరెత్తిస్తున్నాయి. ఈ మేరకు గద్వాలకు చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బీజేపీ నిర్వహించే సకల జనుల విజయ సంకల్ప సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ టైం అయిపోయిందని, బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం వచ్చిందన్నారు. కావున డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే అయోధ్య రాముడి ఉచిత దర్శనం కల్పిస్తామన్నారు.
కేసీఆర్ అబద్ధపు ప్రచారాలు
జోగుళాంబ ఆలయ అభివృద్ధికి మోదీ రూ.70కోట్లు ఇస్తే.. ఆ డబ్బులను సీఎం కేసీఆర్ ఖర్చు చేయలేదని అమిత్ షా అన్నారు. కేసీఆర్ అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. గుర్రంగడ్డ, గట్టు రిజర్వాయర్ను కేసీఆర్ నిర్మించలేదని, కృష్ణానదిపై వంతెనను కూడా విస్మరించారని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. రైతులకు కనీసం హక్కులు కూడా ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. అలాగే రాష్ట్రంలో వాల్మీకులను అన్యాయం చేస్తుందని, వీరికి కేంద్రం న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. కొడుకును సీఎం చేయాలనే కేసీఆర్ ఆలోచిస్తున్నారని, అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శించారు.