TS Elections: తెలంగాణకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం.. రాహుల్ గాంధీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. సాధారణ మెజార్టీకి అవసరమైన స్థానాలను హస్తం పార్టీ కైవసం చేసుకుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఓటమిపాలైంది. ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘గెలుపు, ఓటములతో సంబంధం లేదని, సిద్ధాంతపరమైన యుద్ధం కొనసాగుతుందని, ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను’ అని ట్విటర్లో పోస్టు చేశారు. అదే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుపై ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు చేస్తామన్న అన్ని హామీలను సైతం తప్పకుండా నెరవేరుస్తామమని చెప్పారు.
ALSO READ: ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం… సీఎం ఎవరంటే?
రాహుల్ ‘భారత్ జోడో’ యాత్రతో విజయం
దేశ వ్యాప్తంగా చేపట్టిన రాహుల్ ‘భారత్ జోడో యాత్ర’తో కాంగ్రెస్ విజయం సాధించగా.. దీనికి తోడుగా రేవంత్ రెడ్డి క్యాంపెనింగ్ మరింత ఊపు తీసుకొచ్చింది. ఇఖ బీఆర్ఎస్ నాయకుల తీరు ఇలా అన్నీ కూడా కాంగ్రెస్ విజయానికి కారణమైనట్లు తెలుస్తోంది. ప్రధానంగా ఈ ఎన్నికలు దొరలకు, ప్రజలకు జరిగే యుద్ధమని తెలంగాణలో కాంగ్రెస్ ప్రచారం చేయడం, మార్పు కావాలి-కాంగ్రెస్ రావాలి అంటూ చేసిన నినాదాలు ప్రజల్లోకి చొచ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణలో 64 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా.. బీఆర్ఎస్ 39 చోట్ల, ఎంఐఎం 7 స్థానాల్లో, బీజేపీ 8 చోట్ల, సీపీఐ ఒక్క స్థానంలో గెలుపొందింది.