![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/104113728-780x470.webp)
TS: ఆటో డ్రైవర్ల కీలక ప్రకటన.. ఆ రోజు బంద్కు పిలుపు!
తెలంగాణలోని ఆటో డ్రైవర్లు కీలక ప్రకటన చేశారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు ఆటోల బంద్కు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆటోబంద్ను విజయవంతం చేయాలని టీఏటీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య కోరారు. రాష్ట్రంలో మహిళలకు కల్పించిన ఉచిత బస్సు స్కీంతో డ్రైవర్లు ఉపాధి కోల్పోవడంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికే చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రభుత్వం స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కావున ఈ బంద్లో ప్రతి ఆటో డ్రైవర్ పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
ALSO READ: కేసీఆర్ కీలక ప్రకటన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
బీఆర్టీయూ ఆటో యూనియన్ స్టాండ్..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారెంటీ హామీలలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ పథకంలో భాగంగా డిసెంబర్ 9 నుంచి అర్హత ఉన్న అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకంతో ఆటోలు, ఇతర ప్రైవేటు వాహనాల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గింది. దీంతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయినందున బంద్కు పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు జూపార్క్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్టీయూ ఆటో యూనియన్ స్టాండ్ను ప్రారంభించారు.