TS Politics: ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో చేరనున్నారా?… ఎందుకు?
బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్తో ఇప్పటికే సంప్రదింపులు జరిపారని, అతి త్వరలోనే ఆ పార్టీలో చేరనున్నారని విశ్వాసనీయ వర్గాల నుంచి సమాచారం. రానున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈటల పోటీ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో ఇప్పుడిది హాట్ టాపిక్గా మారింది. బీజేపీలో చేరిన అనతికాలంలోనే ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగి, బీజేపీ తెలంగాణ చేరికల కమిటీ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వహించిన ఈటల రాజేందర్.. పార్టీ మారితే సార్వత్రిక ఎన్నికల ముందు బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బే..!
Also Read: తెలంగాణలో ప్రజపాలన షురూ.. వెల్లువలా దరఖాస్తులు
లోక్ సభ సీటు కోసమేనా?
ఇటీవల తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఈటల రాజేందర్ రెండు స్థానాల నుంచి పోటీ చేశారు. సొంత నియోజకవర్గం హుజూరాబాద్తో పాటు గజ్వేల్లోనూ పోటీ చేశారు. అనూహ్యంగా రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు. ఈటలకు కంచుకోటగా ఉన్న హుజూరాబాద్లో బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి చేతిలో ఆయన ఓడిపోవడం అభిమానులను ఆశ్చర్యపరిచింంది. అయితే లోక్ సభలో పోటీ చేయాలనుకున్న ఈటలకు బీజేపీలో తీవ్ర పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. పైగా ఆయన కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇక్కడ సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్కే తిరిగి టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈటల పార్టీ మారాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read: నేడు రాష్ట్రానికి కేంద్రమంత్రి అమిత్ షా.. టూర్ షెడ్యూల్ ఇదే!
కరీంనగర్ పై పట్టు ఉన్న ఈటల
ఇక తెలంగాణలో 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో 17 లోక్సభ స్థానాలకు గాను 10కి పైగా స్థానాలు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. బలమైన అభ్యర్థులను బరిలో దించాలని కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఈటలను సంప్రదించినట్లు సమాచారం. కరీంనగర్లో గతంలో ఎంపీగా పోటీ చేసిన పొన్నం ప్రభాకర్.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హుస్నాబాద్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. మంత్రి పదవి కూడా ఆయనను వరించింది. దీంతో కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి ఈటలను బరిలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. ఈటల రాజేందర్కు కూడా కరీంనగర్ జిల్లాపై మంచి పట్టు ఉంది.