![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/india-1.jpg)
Team India: జింబాబ్వే టూర్ కు భారత్.. మ్యాచ్ షెడ్యూల్ ఖరారు
టీమిండియా త్వరలోనే జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో జింబాబ్వేతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. అయితే టీ20 వరల్డ్కప్ 2024 ముగిసిన తర్వాత ఈ సిరీస్ ఉండనుంది. అన్ని మ్యాచ్ లు హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో జరుగనున్నాయి. ఈ పర్యటనకు సంబంధించిన వివరాలను జింబాబ్వే క్రికెట్ బోర్డు మంగళవారం వెల్లడించింది. బీసీసీఐతో సుదీర్ఘ చర్చల తర్వాత ఈ సిరీస్ ఖరారైనట్లు సమాచారం. జింబాబ్వే క్రికెట్ ఛైర్మన్ తవెంగ్వా ముకుహ్లానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరిస్తూ ట్విట్టర్ (ఎక్స్) లో తెలిపాడు.
Also read: Ravichandran Ashwin: వైజాగ్ టెస్టులో 45 ఏళ్ల రికార్డు బద్దలు.. సత్తాచాటిన రవిచంద్రన్ అశ్విన్
అంతేకాకుండా..’మా దేశంలో ఈ సంవత్సరం జరిగే అతిపెద్ద అంతర్జాతీయ ఈవెంట్ ఇదే. టీమిండియాకు ఆతిథ్యమిస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా దేశ పర్యటనకు ఒప్పుకున్నందుకు బీసీసీఐకి ధన్యవాదాలు’ అంటూ తవెంగ్వా ఎక్స్ లో కామెంట్స్ చేశాడు.
కాగా.. జింబాబ్వేతో భారత్ మొత్తం 7 మ్యాచ్లు ఆడి ఐదింట్లో విజయాలు సాధించింది. జింబాబ్వేతో టీమిండియా తొలిసారి ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ సందర్భంగా.. బీసీసీఐ సెక్రటరీ జైషా మాట్లాడుతూ.. జింబాబ్వే క్రికెట్ను పునర్నిర్మిస్తున్నందున ప్రపంచ క్రికెట్లో ఇది ఉత్తేజకరమైన దశ అని, దేశంలో క్రికెట్ వృద్ధికి తోడ్పాటునందించేందుకు భారత్ తనవంతు కృషి చేస్తుందని తెలిపారు.