Manifesto: బీజేపీ లక్ష్యం ‘సౌభాగ్య తెలంగాణ’.. ప్రధాన హామీలివే..
బీసీ, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలనే అస్త్రంగా చేసుకుని బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) సందర్భంగా బీజేపీ ‘సకల జనుల సౌభాగ్య తెలంగాణ’ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. బీసీ ముఖ్యమంత్రి, అర్హులైన పేదలందరికీ ఇండ్లు (House), రైతులు, ఉద్యోగులపై హామీలు ఇస్తూనే, ప్రస్తుత బీఆర్ఎస్ (BRS Party) ప్రభుత్వ అవినీతిపై న్యాయ విచారణ చేయిస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. కాంగ్రెస్ మాదిరి ధరణి పోర్టల్ (Dharani Portal) రద్దుకు బీజేపీ నిర్ణయించింది.
చదవండి: కేసీఆర్ మొక్కే బీజేపీ నాశనానికి కారణం: అగ్గి రాజేసిన విజయశాంతి వ్యాఖ్యలు
హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో శనివారం మేనిఫెస్టోను (Manifesto) బీజేపీ అగ్ర నాయకుడు అమిత్ షా(Amit Shah), ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు విడుదల చేశారు. బూటకపు హామీల గోస కాదు, తెలంగాణ ప్రగతి పథానికి బీజేపీ అసలైన భరోసా అని అమిత్ షా పేర్కొన్నారు. తెలంగాణ దిశను మార్చేందుకు దశసూత్ర ప్రణాళిక తమ మేనిఫెస్టో అని తెలిపారు. రైతు సంక్షేమమే దేశ సంక్షేమమని చెప్పారు.
చదవండి: బీఆర్ఎస్ టైం అయిపోయింది.. గద్వాల సభలో అమిత్ షా
మేనిఫెస్టోలో ప్రధాన హామీలు
- బీసీ వర్గానికి చెందిన నాయకుడిని ముఖ్యమంత్రిని చేస్తాం.
- రైతుల నుంచి ధాన్యం కొనుగోలు మద్దతు ధర క్వింటాలుకు రూ.3,100 కు పెంపు.
- ప్రజలందరికీ సుపరిపాలన, సమర్థవంతమైన పాలన అందిస్తాం.
- ఎస్సీ ఉప కులాల వర్గీకరణకు సహకారం.
- కృష్ణా నదిపై పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి.
- ధరణి రద్దు చేసి పారదర్శకమైన వ్యవస్థతో ‘మీ భూమి’ పోర్టల్ ఏర్పాటు.
- ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం కమిటీ.
- మతపరమైన రిజర్వేషన్లు తొలగింపు
- ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక వ్యవస్థ.
- రైతులకు ఉచితంగా దేశీ ఆవుల పంపిణీ.
- బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తితో విచారణ.
- పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గింపు.
- యూపీఎస్సీ తరహాలో టీఎస్ పీఎస్సీ పరీక్షల నిర్వహణ.
- చిన్న సన్నకారు రైతులకు ఎరువులు, విత్తనాల కొనుగోలు కోసం రూ.2,500 కేటాయింపు.
- పేదలకు రూ.10 లక్షల వరకు కార్పొరేట్ స్థాయి వైద్యం.
- సమక్క-సారక్క జాతరకు జాతీయ స్థాయి హోదా
- ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం, పింఛన్లు అందజేత.
- మహిళా సంఘాలకు ఒక శాతం వడ్డీతో రుణాలు.
- ఏడాదికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ.
- అర్హులైన పేదలకు గ్రామాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ.
- గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న వారి కోసం ప్రత్యేకంగా బోర్డు లేదా మంత్రిత్వ శాఖ.
- అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు.
- పేదలకు ప్రతి సంవత్సరం ఉచితంగా ఆరోగ్య పరీక్షలు.
- సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహణ. బైరాన్ పల్లి, పరకాల అమరవీరులను స్మరిస్తూ ఆగస్ట్ 27న ‘రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ దినం’ నిర్వహణ.