Hyd: బీజేపీ నాయకులకు ‘క్లాస్’ తీసుకున్న అమిత్ షా.. సిట్టింగ్ లకే మళ్లీ అవకాశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ తక్కువ స్థానాలు గెలుపొందడంపై అసంతృప్తి చెందారు. ఎన్నికల్లో పార్టీ పొందిన ఓట్లపై అసహనం వ్యక్తం వ్యక్తం చేశారు. వర్గ విబేధాలతో ఇలాంటి ఫలితం వచ్చిందని పేర్కొన్నారు. పార్టీ నాయకులు ఐకమత్యంగా ఉంటే ఫలితాలు వేరేలా ఉండేవని చెప్పినట్లు సమాచారం.
Also Read పవన్ అంటే లోకేశ్ కు ఇష్టం లేదా? ఆ వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏమిటి?
లోక్ సభ ఎన్నికలపై పార్టీ నాయకత్వానికి దిశానిర్దేశం చేసేందుకు గురువారం అమిత్ షా తెలంగాణకు విచ్చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులతో కీలక విషయాలు చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశపర్చాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. 30 సీట్లు వస్తాయని అనుకుంటే అనుకున్నన్ని సాధించలేదని చెప్పారు.
Also Read సీఎం జగన్ 85 శాతం ఫెయిల్.. నవరత్నాలు నవమోసాలయ్యాయి
‘లోక్ సభ ఎన్నికల్లో ఇలాంటిది జరగకూడదు. సమన్వయంతో పని చేయాలి. రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు గెలిచేందుకు కృషి చేయాలి. సిట్టింగ్ ఎంపీలకే మరోసారి అవకాశం కల్పిస్తాం. మిగిలిన చోట్ల సర్వేల ఆధారంగా అవకాశం ఇస్తాం. ఈసారి అభ్యర్థులను త్వరగా ప్రకటిస్తాం’ అని అమిత్ షా వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీనికితోడు అసెంబ్లీలో పార్టీ శాసనసభా పక్ష నేత ఎంపికపై కూడా చర్చించినట్లు కాషాయ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ నాయకులు బండి సంజయ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, మురళీధర్ రావు, లక్ష్మణ్, అరవింద్ తదితరులు హాజరైనట్లు సమాచారం.
భాగ్యలక్ష్మి ఆలయం సందర్శన
హైదరాబాద్ పాతబస్తీలోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని అమిత్ షా మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కాగా అమిత్ షా తెలంగాణ పర్యటన సమయంలో ఈ ఆలయ సందర్శనకు ప్రాధాన్యమిస్తుండడం గమనార్హం.