![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-17-at-3.26.32-PM-650x470.jpeg)
YCP: రానున్న ఎన్నికల్లో 150కి పైగా స్థానాల్లో గెలుస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధినేత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ 150కి పైగా స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారం చేపడుతుందని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తంచేశారు. అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు జరగనున్న ‘సిద్ధం’ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. రాప్తాడు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నామని, దీనికి భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలి వస్తారని అన్నారు. ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొందేందుకు ఈ సభ పార్టీకి ఊతమిస్తుందని, శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతుందని భావిస్తున్నామన్నారు.
ALSO READ: వలంటీర్లపై మాట మార్చిన పవన్కల్యాణ్.. ఓట్ల కోసమేనా?
అంతేకాదు, తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే రానున్న ఎన్నికల్లో తమకు మరోసారి విజయాన్ని అందిస్తాయని భరోసా వ్యక్తంచేశారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలు ఏపీలో అమలు చేస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. వైఎస్సాఆర్ చేయూత, అమ్మఒడి, నాడు-నేడు, జగనన్న నేస్తం, రైతు భరోసా వంటి పథకాలతో ఎంతో మంది పేద, మధ్యతరగతి ప్రజలు లబ్ధి పొందుతున్నారని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రానికి చేసిందేమీ లేదని, చెప్పుకోవడానికి ఏమీ లేకనే వైసీపీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు.