National Awards: జాతీయ అవార్డుల పేర్లను మార్చారా..?
ఉత్తమ జాతీయ సమగ్రత చలన చిత్రం అవార్డు పేర్లని మార్చారు. గతంలో ఇందిరాగాంధీ పేరిట ఇస్తున్న అవార్డును ‘ఉత్తమ నూతన దర్శకుడు’ అవార్డుగా, నర్గీస్ దత్ పేరిట ఇస్తున్న అవార్డును ‘జాతీయ, సామాజిక – పర్యావరణ విలువల ఉత్తమ చలనచిత్రం’ అవార్డుగా ఇవ్వాలని ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు ఈ ఏడాది ప్రదానం చేయనున్న 70వ జాతీయ చలన చిత్ర అవార్డులకు సంబంధించిన రెండు క్యాటగిరీల పేర్లు మార్చుతూ కమిటీ నిర్ణయం తీసుకుంది. కాగా, ఇందిరాగాంధీ పేరు మీద అవార్డును 1984లో, నర్గీస్దత్ జాతీయ సమైక్యతా చిత్రం అవార్డును 1965లో ప్రవేశపెట్టారు. తాజాగా, ఈ అవార్డుల పేర్లను మార్చుతూ జాతీయ అవార్డుల కమిటీ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
ALSO READ: ‘ఊరు పేరు భైరవకోన’ రికార్డు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
పెరిగిన బహుమతి మొత్తాలు..
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (ఐ అండ్ బి) అదనపు కార్యదర్శి నీరజా శేఖర్ నేతృత్వంలో పలు మార్పులు చేశారు. ఇందులో భాగంగా బహుమతి మొత్తాలు కూడా పెంచారు. ‘ఉత్తమ నూతన దర్శకుడు’ అవార్డుకు ఇస్తున్న మొత్తాన్ని రూ. 3 లక్షలకు పెంచాలని, రజత పతకం లభించే ‘జాతీయ, సామాజిక – పర్యావరణ విలువల ఉత్తమ చలనచిత్రం’ అవార్డుకి నిర్మాతకు, దర్శకుడికి ఒకొక్కరికి ఇస్తున్న మొత్తాన్ని రూ. లక్షన్నర నుంచి రూ. 2 లక్షలకు పెంచాలని కమిటీ సిఫార్సు చేసింది. అదే విధంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది.