![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/01/education-1.jpg)
Students Admission: విద్యారంగంలో సర్కారు మార్పులు.. దేశంలోనే నెం.1 గా ఏపీ
ఏపీలో జగన్ సర్కారు ఏర్పడిన తర్వాత నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ పాఠశాలల స్వరూపం సమూలంగా మారిపోయింది. నాడు- నేడుతో పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన, అమ్మఒడి లాంటి పథకాలు సత్ఫలితాలనిచ్చాయి. దాంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీంతో విద్యావ్యవస్థలో ఏపీ దేశంలోనే నెం.1 గా ఉన్నట్టు ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది.
Also read: Chandrababu: చంద్రబాబుకు ఘోర పరాభవం.. ఏకంగా ఆయనకే నిరసన సెగ
రాష్ట్రంలో 2021 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, ఎలిమెంటరీ స్థాయిలో పిల్లల చేరికల్లో స్థూల నమోదు నిష్పత్తి సూచీలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండడమే ఇందుకు నిదర్శనం. 2017తో పోలిస్తే 2021లో దేశంలోని స్థూల నమోదు నిష్పత్తి పెరిగిన టాప్ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని ఎస్బీఐ విడుదల చేసిన ఆ నివేదిక తెలిపింది. అలాగే, 2021లో జాతీయ స్థూల నమోదును మించి రాష్ట్రంలోనే అత్యధిక స్థూల నమోదు ఉందని కూడా పేర్కొంది.
అమ్మఒడి పథకం మేలు చేసిందా
స్థూల నమోదు నిష్పత్తిలో టాప్ నాలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తరువాత ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2017తో పోలిస్తే 2021లో ప్రైమరీలో 18.4 శాతం, అప్పర్ ప్రైమరీలో 13.4 శాతం, ఎలిమెంటరీలో 16.5 శాతం స్థూల నమోదు పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఇందుకు ప్రధాన కారణం బడి ఈడు పిల్లలందరూ బడుల్లోనే ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేనని స్పష్టంగా తెలుస్తోంది.
Also read: BJP: బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్.. యూపీ నుంచి రాజ్యసభకు చిరంజీవి?
అందులో భాగంగా.. అన్ని వర్గాల్లోని పేదల తల్లిదండ్రులకు తమ పిల్లల చదువులు భారం కాకూడదనే దూరదృష్టితో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న అమ్మఒడి పథకం అమలుచేస్తోంది. ఈ పథకం అమలు ద్వారా పేద వర్గాల పిల్లలందరూ స్కూళ్లలో చేరేలా ప్రోత్సాహం అందిస్తోంది. నిజానికి.. పిల్లలను బడికి పంపకుండా పనికి పంపిస్తే తమకు ఆర్థికంగా చేదోడు వాదోడుగా నిలుస్తారనే ఆలోచనలో పేద కుటుంబాల వారు ఆలోచించేవారు. అయితే.. వైసిపి ప్రభుత్వం జగనన్న అమ్మఒడి ద్వారా పిల్లలను స్కూళ్లకు పంపితే ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తోంది. దీంతో అన్ని వర్గాల్లోని పేదలు తమ పిల్లలను స్కూళ్లకు పంపుతున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో సమూల సంస్కరణలు
మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో నాడు- నేడు కార్యక్రమం ద్వారా తొలి దశలో 15 వేల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించారు. అలాగే రెండో దశలో మరో 22,221 పాఠశాలల్లో సౌకర్యాలు మెరుగు చేసి పాఠశాలల రూపునే మార్చేశారు. అలాగే పిల్లలు మధ్యలోనే చదువు మానకుండా గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా చర్యలు తీసుకుంటోంది. పిల్లలు స్కూలు మానేస్తే ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకుని మళ్లీ వారు స్కూలికి వచ్చేలా కృషి చేస్తోంది. అలాగే పేదవిద్యార్థులు మధ్యాహ్నం ఆకలితో బాధపడకుండా ఉండేందుకు పాఠశాలలో జగనన్న గోరుముద్దతో పౌష్టికమైన ఆహారాన్ని అందిస్తోంది. అలాగే పేద పిల్లల చదువుకు అవసరమైన నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, బూట్లు, బ్యాగులు ఇలా అన్ని సౌకర్యాలు ప్రభుత్వమే భరిస్తోంది. అలాగే ప్రభుత్వ విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని, వారిలో నైపుణ్యం పెరగాలని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం క్లాసులను అమలుచేస్తోంది. పిల్లలకు ప్రపంచ విజ్ఞానం కలగాలని, అలాగే వారు చదువుకునే పాఠాలలో పలు రకాల సందేహాలను తీర్చుకునేందుకు ట్యాబ్ లను సైతం ఇస్తోంది. ఈ చర్యలతోనే ప్రైవేటు పాఠశాలలో అధిక ఫీజులు చెల్లించలేని, ఇంట్లో ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో బడికి పంపలేని పేద కుటుంబాల పిల్లలంతా ఇప్పుడు ఆనందంగా స్కూళ్లలో చదువుకుంటున్నారు.