Pension: ప్రజలకు సీఎం జగన్ ‘న్యూ ఇయర్ గిఫ్ట్’.. అర్హులందరికీ అందాలి
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి మరో శుభవార్త వినిపించారు. జనవరి నుంచి పింఛన్ ను రూ.3 వేలు అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు.
Also Read అంగన్ వాడీ కార్యకర్తలకు హెచ్చరిస్తూనే ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి
గత ప్రభుత్వంలో రూ.వెయ్యి మాత్రమే ఉన్న పింఛన్ ను అధికారంలోకి వచ్చాక రూ.2,250 చేసినట్లు గుర్తు చేశారు. ఇప్పుడు రూ.3 వేలకు పెంచుకుంటూ వచ్చామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం పింఛన్లకు రూ.400 కోట్లు ఖర్చు చేయగా.. ఇప్పుడు మన ప్రభుత్వం రూ.1,950 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. పింఛన్ దారుల సంఖ్య కూడా భారీగా పెరిగిందని.. 39 లక్షల నుంచి 66 లక్షలకు పెరిగిందని వివరించారు. ప్రతి ఒక్కరికీ పింఛన్ అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఏ పండుగ ఉన్నా.. ఆదివారం ఉన్నా కూడా ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.
Also Read బీజేపీ నాయకులకు ‘క్లాస్’ తీసుకున్న అమిత్ షా.. సిట్టింగ్ లకే మళ్లీ అవకాశం
సమావేశంలో జనవరి 19వ తేదీన అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంపై సీఎం జగన్ చర్చించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘మన ప్రభుత్వం విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. ఎమ్మెల్యేలు పింఛన్ పంపిణీలో పాల్గొనాలి. పింఛన్ పెంపుతో 8 రోజుల పాటు ‘పెన్షన్ కానుక’ నిర్వహించాలి’ అని తెలిపారు.