![](https://pakkatelugu.com/wp-content/uploads/2024/02/14062022-eatala-inner.jpg)
BJP: మల్కాజ్గిరి బరిలో ఈటల.. త్వరలో బీజేపీ మొదటి జాబితా?
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై బీజేపీ అచితూచి వ్యవహరిస్తోంది. గతంలో గెలుపొందిన నాలుగు స్థానాలను కాపాడుకోవడంతో పాటు, మరో ఆరు స్థానాల్లో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లోనూ గెలుపు గుర్రాలకే ఛాన్స్ ఇవ్వాలని ఆ పార్టీ జాతీయ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో ఈటల రాజేందర్ను బరిలోకి దింపాలని ఆ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజురాబాద్ నియోజక వర్గాల్లో పోటీ చేసిన ఈటల రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఎలాగైనా పోటీ చేసి తీరాలని పట్టుదలగా ఉన్న ఆయన.. మల్కాజ్గిరి టిక్కెట్ కోసం పట్టుబట్టి సాధించినట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించి కాంగ్రెస్, బీఆర్ఎస్లను దెబ్బ కొట్టాలని ఆయన భావిస్తున్నారు.
ALSO READ: పిఠాపురానికి మకాం మార్చిన పవన్..!
మరోవైపు.. నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్, మహబూబ్నగర్, చేవెళ్ల, మెదక్, భువనగిరి తదితర స్థానాలకు సైతం బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్–జి.కిషన్రెడ్డి, కరీంనగర్–బండి సంజయ్, నిజామాబాద్–ధర్మపురి అర్వింద్, మహబూబ్నగర్–డీకే అరుణ, చేవెళ్ల–కొండా విశ్వేశ్వర్రెడ్డి, మెదక్–ఎం.రఘునందన్రావు, భువనగిరి–బూర నర్సయ్యగౌడ్ పేర్లను ఫిక్స్ చేసినట్లు సమాచారం. వీరి అభ్యర్థిత్వాలపై పార్టీలోనూ ఏకాభిప్రాయం వ్యక్తం అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వీరి పేర్లతో మొదటి జాబితాను అధికారికంగా వెల్లడించనున్నట్లు సమాచారం.