KCR: కేసీఆర్ కీలక ప్రకటన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తెలంగాణ భవన్ లో పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత 3 నెలల విరామం అనంతరం మొదటిసారిగా పార్టీ కార్యాలయానికి వచ్చారు. దీంతో అధినేత కేసీఆర్ కు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల పార్టీ నేతలతో కేసీఆర్ మాట్లాడారు.
Also read: Venkatesh Netha: బీఆర్ఎస్ కు మరో భారీ షాక్.. పార్టీకి సిట్టింగ్ ఎంపీ గుడ్ బై
ఈ సందర్భంగా.. తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు ఈ నెల 13న నల్లగొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక వైఖరిని అలంబిస్తోందని విమర్శించారు.
నాడు ఉద్యమంతో తెలంగాణ సాధించుకున్న రీతిలోనే సాగునీటి హక్కుల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతుల సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యంతో సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టలమీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. నల్గొండ బహిరంగసభతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని.. రాష్ట్ర హక్కులు కాపాడేందుకు ఎంతకైనా పోరాడుతామన్నారు. దీన్ని ప్రజా మద్దతుతో తిప్పికొడుతామన్నారు.